న్యూఢిల్లీ, నవంబర్ 19: విమాన ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత పాంత్రాలు విధిస్తున్న సుంకాన్ని తగ్గించాలని, తద్వారా విమాన ప్రయాణికులు పెరుగడానికి దోహదం చేసినట్లు అవుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా తెలిపారు. కరోనా దెబ్బకు విమానయాన రంగం ఢీలా పడిందని, దీంతో పలు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసుకోవడంతో ఆయా సంస్థల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. ప్రస్తుతం ఈ రంగం తిరిగి కోలుకుంటున్నదని, కరోనాకు ముందు స్థాయికి విమానయాన రంగం ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నదని మంత్రి చెప్పారు. జెట్ ఫ్యూయల్పై రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలు అధిక స్థాయిలో విధిస్తున్న వ్యాట్ను తగ్గించాలని ఆయన సూచించారు. విమానయాన సంస్థల నిర్వహణలో అత్యధిక శాతం ఇంధనకోసం ఖర్చు చేస్తున్నాయని, ఈ ఇంధనంపై విధిస్తున్న పన్నుతో ఆయా సంస్థల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని ఇండస్ట్రీ బాడీ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వెల్లడించారు. ఇటీవలకాలంలో విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం విమాన ఇంధనంపై విధిస్తున్న వ్యాట్తో విమానయాన రంగం పుంజుకోవడం అసాధ్యమని మంత్రి స్పష్టంచేశారు. అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ రంగంపై రాష్ట్ర, యూటీలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.