Fixed Diposits | ఆర్బీఐ రెపోరేట్కు అనుగుణంగా ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేశాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు వడ్డీరేట్లు భారీగా పెంచాయి. గత నెలాఖరులో ఆర్బీఐ 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తదనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగిన ప్రధాన బ్యాంకుల వడ్డీరేట్ల గురించి తెలుసుకుందాం..!
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్బీఐ 20 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఏడు రోజుల నుంచి పదేండ్ల లోపు గడువు గల వివిధ టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ మూడు నుంచి 5.85 శాతానికి పెంచివేసింది. సీనియర్ సిటిజన్లకు 3.50 నుంచి 6.65 శాతం వడ్డీ అందిస్తున్నట్లు తెలిపింది. పెంచిన వడ్డీరేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏడు రోజుల నుంచి పదేండ్ల లోపు వివిధ టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 75 బేసిక్ పాయింట్ల వరకు వడ్డీరేట్లు పెంచేసింది. సాధారణ ప్రజలకు 3% నుంచి 6.00%, సీనియర్ సిటిజన్లకు 3.50% నుంచి 6.75% శాతానికి వడ్డీ వర్తిస్తుంది. ఈ నెల 11 నుంచి పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి.
మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేసింది. ఏడు రోజుల నుంచి పదేండ్ల లోపు వివిధ టెన్యూర్లపై వడ్డీరేట్లు 3% నుంచి 6.20%, సీనియర్ సిటిజన్లకు 3.50% నుంచి 6.75 శాతానికి వడ్డీరేట్లు పెంచేసింది. పెరిగిన వడ్డీరేట్లు ఈ నెల 18 నుంచి అమలులోకి వచ్చాయి.
యాక్సిస్ బ్యాంక్.. ఏడు రోజుల నుంచి పదేండ్ల లోపు వివిధ టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేసింది. సాధారణ ప్రజానీకానికి టెన్యూర్ల వారీగా 3.50% నుంచి 6.10% శాతానికి, సీనియర్ సిటిజన్లకు 3.50% నుంచి 6.85% శాతానికి వడ్డీరేట్లు పెరిగాయి. పెరిగిన వడ్డీరేట్లు ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చాయి.