న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో 2022 ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 8.5-9 శాతం నుంచి 9.3-9.6 శాతానికి ఎస్బీఐ రీసెర్చి నివేదిక సవరించింది. జులై-సెప్టెంబర్ క్వార్టర్లో వైరస్ బారినపడిన టాప్ 15 దేశాల్లో అతితక్కువ కేసులు నమోదైన రెండవ దేశంగా భారత్ నిలవడం వృద్ధి రేటుపై అంచనాలను మెరుగుపరిచింది. మరోవైపు ఆర్బీఐ సైతం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేసిన క్రమంలో ఎస్బీఐ రీసెర్చి నివేదిక సైతం దాదాపు అవే అంచనాలను వెల్లడించింది.
ఎస్బీఐ రిపోర్ట్ ఆధారంగా 2020 ఆర్ధిక సంవత్సరంలో నమోదైన వాస్తవ జీడీపీ రూ 145.69 లక్షల కోట్ల కంటే ఈసారి వాస్తవ జీడీపీ రూ 2.4 లక్షల కోట్లు అధికంగా ఉంటుందని ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్ధిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. దేశంలో ఆర్ధిక కార్యకలాపాలు కొవిడ్ ముందున్న స్ధాయికి చేరుతున్నాయని ఘోష్ అన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో క్వార్టర్లో భారత్ సాధించిన 8.1 శాతం వృద్ధి రేటు అన్ని ఆర్ధిక వ్యవస్ధలు సాధించిన వృద్ధి రేటు కంటే అత్యధికమని చెప్పారు.