న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోంలోన్ ( SBI Home Loan ) కోసం చూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హోంలోన్పై వడ్డీ రేటును 6.7 శాతానికి తగ్గించింది. అంతేకాదు ఎంత లోన్ తీసుకున్నా.. ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. ఇలా ఒకే రేటుకు హోంలోన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. అంతేకాదు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. దేశంలో పండుగల సీజన్కు ముందు ఇళ్లు కొనాలనుకుంటున్న వారిని ఆకర్షించడానికి ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఎలా లబ్ధి చేకూర్చనుందో కూడా బ్యాంకు వివరించింది.
ఇప్పటి వరకూ ఎవరైనా రూ.75 లక్షల హోంలోన్ తీసుకుంటే.. 7.15 శాతం వడ్డీ కట్టాల్సి వచ్చేది. ఈ తాజా ఆఫర్తో ఏకంగా 45 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనివల్ల రూ.75 లక్షల లోన్, 30 ఏళ్ల వ్యవధిపై రూ.8 లక్షల వరకూ వడ్డీ మిగులుతుంది అని ఎస్బీఐ తెలిపింది. గతంలో ఉద్యోగులకు, ఉద్యోగేతరులకు వేర్వేరు వడ్డీ రేట్లు ఉండేవి. ఉద్యోగేతరులైతే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఈ తాజా నిర్ణయం వల్ల ఉద్యోగేతరులు కూడా తమ వడ్డీ రేటుపై 15 బేసిస్ పాయింట్లు ఆదా చేసుకోవచ్చు అని బ్యాంక్ చెప్పింది.
ఇన్నాళ్లూ హోంలోన్ వడ్డీ రేట్లపై ఆఫర్లు ఇచ్చినా.. అది సాధారణంగా కొంత మొత్తం లోన్ వరకూ, లోన్ తీసుకునే వారి వృత్తికి అనుగుణంగా ఉండేవి. ఈసారి మాత్రం అందరికీ ఆఫర్ వర్తించేలా నిర్ణయం తీసుకున్నాం అని ఎస్బీఐ రీటెయిల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ సీఎస్ శెట్టి చెప్పారు. ఇన్నాళ్లూ కేవలం బడ్జెట్ ఇళ్లను తీసుకునే వారినే ప్రోత్సహించినా.. తాజా నిర్ణయం ఎలాంటి బడ్జెట్ వారికైనా లబ్ధి చేకూర్చనుంది.