ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తాజాగా అందుబాటులోకి తెచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ‘ఆరోగ్య సుప్రీం’ పాలసీకి మొదట్లోనే మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. 20 బేసిక్ కవరేజీలు, 8 ఆప్షనల్ కవరేజీలతో సహా పూర్తి ఆరోగ్య బీమా కవరేజీని అందించేలా ఈ పాలసీని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ రూపొందించింది.
ఎప్పటికప్పుడు ఎస్బీఐ ఖాతాదారుల సంక్షేమం కోసం కొత్త పథకాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంకింగ్ రంగమే కాక, బీమా రంగంలోనూ ఖాతాదారుల కోసం సరికొత్త స్కీమ్లను అందుబాటులోకి తెస్తున్నది. ఈ క్రమంలోనే…. తాజాగా ‘ఆరోగ్య సుప్రీం’ పాలసీని తీసుకొచ్చింది.
‘ఆరోగ్య సుప్రీం’ బీమా పాలసీ కింద పాలసీదారుకు రూ. 5 కోట్ల వరకు బీమా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారుడి అవసరాలు, కవరేజీ ఫీచర్ల ఆధారంగా ప్రో, ప్లస్, ప్రీమియం అనే మూడు ఆప్షన్లలో ఏదైనా ఒక దానిని ఎంచుకోవచ్చు.
సమ్ ఇన్సూర్డ్ రీఫిల్, రికవరీ బెనిఫిట్ వంటి కస్టమర్ ఫ్రెండ్లీ ఒప్పందాల్లో భాగంగా 1-3 ఏండ్ల వరకు పాలసీ గడువు నిర్ణయించుకోవచ్చు. కరోనా మహమ్మారి వల్ల ఇన్సూరెన్స్ పాలసీలకు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. ఎస్బీఐ పలు బీమా పాలసీలను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ & సీఈఓ పీసీ కాండ్పాల్ స్పందిస్తూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమాకు ప్రాధాన్యం పెరిగింది’ అని చెప్పారు.
‘కరోనా వల్ల ప్రతి ఒక్కరికి బీమా అవసరం తెలిసి వచ్చింది. దీంతో చాలా మంది పాలసీలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో… ఆరోగ్య సుప్రీం, సమగ్ర ఆరోగ్య బీమా పథకాలను ప్రారంభించాం. వినియోగదారులు వారి అవసరాలకు తగ్గట్లుగా ప్రీమియం, దాని మెచ్యూరిటీ కాలం ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాం’ అని వెల్లడించారు.