న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ‘అమృత్ కలశ్’ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) స్కీం దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ 400 రోజుల కాలపరిమితి పథకానికి ఈ ఏడాది డిసెంబర్ 31దాకా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. నిజానికి మంగళవారం (ఆగస్టు 15)తోనే ఈ స్కీం గడువు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలోనే గడువును మరో నాలుగున్నర నెలలు పెంచుతూ బ్యాంక్ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఈ స్కీంను ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఎస్బీఐ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తొలుత మార్చి 31నే దీన్ని ఆపేయాలనుకున్నారు. అయినప్పటికీ కొనసాగించారు. కాగా, ఇదో వ్యక్తిగత పథకం. డిపాజిట్దారులు 7.10 శాతం వడ్డీరేటును అందుకోవచ్చు. వృద్ధులు, అర్హత ఉన్న సిబ్బంది, స్టాఫ్ పెన్షనర్లకు మరో అర శాతం (7.6 శాతం వరకు) అదనపు వడ్డీ లభిస్తుంది. ‘అమృత్ కలశ్’ ఎఫ్డీ పథకానికి అర్హత ఉన్న వాటిలో రూ.2 కోట్లలోపున్న ఎన్నారై రుపీ టర్మ్ డిపాజిట్లు, కొత్త-రెన్యువల్ డిపాజిట్లు, టర్మ్-స్పెషల్ టర్మ్ డిపాజిట్లున్నాయి. టర్మ్ డిపాజిట్లకు నెల, త్రైమాసిక, అర్ధవార్షిక పద్ధతుల్లో వడ్డీ చెల్లింపులుంటాయి. స్పెషల్ టర్మ్ డిపాజిట్లకు మాత్రం మెచ్యూరిటీపైనే వడ్డీ లభిస్తుంది. ఈ డిపాజిట్ల పూచీకత్తుతో రుణాలనూ తీసుకోవచ్చు. ఇక ఆదాయ పన్ను (ఐటీ) చట్టం నిబంధనల ప్రకారం టీడీఎస్, ఇతరత్రా పన్నులు మినహాయించబడుతాయి. ఎస్బీఐ శాఖలు, ఐఎన్బీ, యోనో యాప్ ద్వారా ఈ ఎఫ్డీని పొందవచ్చు.