SBI chairman | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ అంటే భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. దాని చైర్మన్ దినేశ్ ఖర్రా గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.34.42 లక్షల వేతనం ఇంటికి తీసుకెళ్లారు. ఇంతకుముందు చైర్మన్గా ఉన్న రజనీశ్ కుమార్ తీసుకెళ్లిన వేతనంతో పోలిస్తే 13.4 శాతం ఎక్కువ అని ఎస్బీఐ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. కానీ ప్రైవేట్ బ్యాంకుల అధినేతలు, కార్పొరేట్ సంస్థల సీఈవోలు, అధినేతల వేతన ప్యాకేజీలతో పోలిస్తే ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖర్రా వేతన ప్యాకేజీ చాలా తక్కువ.
2021-22లో దినేశ్ ఖర్రా రూ.27 లక్షల కనీస వేతనం పొందితే రూ.7,42,500 కరువు భత్యం (డీఏ)తోపాటు ఇన్సెంటివ్ల రూపంలో రూ.4 లక్షలు అందుకున్నారు. దినేశ్ ఖర్రా 2020 అక్టోబర్లో ఎస్బీఐ చైర్మన్గా నియమితులయ్యారు. అంతకుముందు బ్యాంక్ గ్లోబల్ బ్యాంకింగ్- ఎస్బీఐ అనుబంధ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశారు. గత ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తీసుకెళ్లిన వార్షిక వేతనం రూ.30.35 లక్షలు. 2020 అక్టోబర్లో రిటైర్మెంట్ సమయంలో రూ.14.04 లక్షలు లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బు తీసుకున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో కెనరా బ్యాంక్ ఎండీ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎల్వీ ప్రభాకర్ రూ.36.89 లక్షల వేతనం అందుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ కం సీఈవో సంజీవ్ చద్దా వార్షిక వేతనం రూ.40.46 లక్షలు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవో కం ఎండీల వేతనంతో పోలిస్తే, ప్రైవేట్ బ్యాంకుల సీఈవోల వేతనాలు పలు రెట్లు ఎక్కువ. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ ఎండీ కం సీఈవో శశిధర్ జగదీశన్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4.77 కోట్ల వేతనం అందుకున్నారు. దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అధినతే అమితాబ్ చౌదరి వేతనం రూ.6.52 కోట్లు. అయితే, 2020-21లో మాత్రమే కొవిడ్-19 సంక్షోభం వేళ వేతనం లేకుండానే అమితాబ్ చౌదరి పని చేశారు.