NSE Co-Location Scam | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (షాట్) తాత్కాలిక ఊరట కల్పించింది. హిమాలయ యోగి కేసు విచారణ విషయమై కోర్టు ముందు రూ.2 కోట్ల నగదు ఆరువారాల్లో డిపాజిట్ చేయాలని షాట్ సోమవారం ఆదేశించింది. ఎన్ఎస్ఈలో సుపరిపాలనా లోపాలపై దర్యాప్తు జరిపిన సెబీ.. ఫిబ్రవరి 11న చిత్రా రామకృష్ణను రూ.3 కోట్లు జమ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రా రామకృష్ణ రూ.3 కోట్లు జమ చేసి ఉంటే, కేసు విచారణ పూర్తయ్యే వరకు మిగతా రూ. కోటి నగదు విత్ డ్రా చేయరాదని షాట్ సభ్యులు తరుణ్ అగర్వాలా, మీరా స్వరూప్లు ఆదేశించారు.
చిత్ర రామకృష్ణ తీసుకున్న ఎక్సెస్ లీవ్ ఎన్క్యాష్మెంట్ రూ.1.54 కోట్లు, డిఫర్డ్ బోనస్ రూ.2.83 కోట్లను వసూలు చేయాలని ఎన్ఎస్ఈని సెబీ గతంలో ఆదేశించింది. అయితే రూ.473 కోట్ల మేరకు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్లో డిపాజిట్ చేయడానికి బదులు చిత్రా రామకృష్ణకు చెందిన ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని షాట్ ఆదేశించింది. దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.