న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడటంతో రెండేండ్ల పాటు ఇంటి నుంచి పనిచేసిన ఉద్యోగులు క్రమంగా తిరిగి కార్యాలయాల బాట పడుతున్నారు. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరుతుండటంతో వర్క్ ఫ్రం ఆఫీస్కు ఉద్యోగులు అలవాటు పడుతున్నారు. శాంసంగ్, మింత్ర, గార్టనర్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తూ గ్రాండ్ వెల్కం పార్టీలను ఏర్పాటు చేస్తున్నాయి.
ఆఫీసులను మళ్లీ తెరిచేందుకు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నాయి. గార్ట్నర్ ఇటీవల తమ ఉద్యోగుల కోసం రీఓపెనింగ్ సెర్మనీలను నిర్వహించింది. పలు కంపెనీలు జులై-సెప్టెంబర్ క్వార్టర్లో ఇలాంటి వేడుకలు నిర్వహించనున్నాయి. మరోవైపు ప్రాపర్టీ కంపెనీలకు చెందిన 50-60 శాతం మంది ఉద్యోగులు తిరిగి కార్యాలయాల నుంచి పనిచేస్తుండగా మిగిలిన వారు హైబ్రిడ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఫ్యాషన్ ఈ కామర్స్ కంపెనీ మింత్ర ఈ ఏడాది ఏప్రిల్లో బెంగళూర్లోని మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన భవనంలోకి మారింది.
ఉద్యోగులు ఆడుతూపాడుతూ పనిచేసే వాతావరణం కల్పిస్తూ వారిని కార్యాలయాలకు రప్పించేలా చర్యలు చేపడుతున్నట్టు మింత్ర పేర్కొంది. కార్యాలయాలను కేవలం పని ప్రదేశంలా కాకుండా ఉద్యోగుల్లో సృజనాత్మకత పెంపొందిస్తూ వారు సేదతీరేందుకు, ఆహ్లాదంలా గడిపే వాతావరణం ఉండేలా కార్పొరేట్ కంపెనీలు చొరవ చూపుతున్నాయి వర్క్స్పేస్ డిజైన్ సంస్ధ స్పేస్ మ్యాట్రిక్స్ సీఈవో అక్షయ్ లఖన్పాల్ చెప్పుకొచ్చారు.