హైదరాబాద్, నవంబర్ 27: ఇండ్ల కొనుగోలుదారుల అభిరుచి మారుతున్నది. ఈ క్రమంలోనే బడ్జెట్ హౌజ్ల నుంచి లగ్జరీ హోమ్ల వైపు కదులుతున్నారు. దేశవ్యాప్తంగా 97 శాతం పెరిగిన లగ్జరీ ఇండ్ల అమ్మకాలే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్లో రూ.4 కోట్లకుపైగా విలువైన ఇండ్ల అమ్మకాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో టాప్-3లో హైదరాబాద్కు చోటు దక్కగా.. మొత్తం విక్రయాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్ల వాటానే 90 శాతం ఉండటం విశేషమని సోమవారం ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో సీబీఆర్ఈ అన్నది.
దాదాపు రెట్టింపు
హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, కోల్కతా నగరాల్లో లగ్జరీ ఇండ్ల సేల్స్పై ‘ఇండియా మార్కెట్ మానిటర్ క్యూ3 2023’ పేరుతో సీబీఆర్ఈ ఓ రిపోర్టు ఇచ్చింది. గత ఏడాది జనవరి-సెప్టెంబర్లో ఈ 7 నగరాల్లో 4,689 లగ్జరీ నివాసాలు అమ్ముడయ్యాయి. అయితే ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్లో 9,246 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందులో ఢిల్లీ-ఎన్సీఆర్ వాటానే 37 శాతంగా ఉండగా, ఇక్కడ ఈసారి 3,400 ఇండ్ల అమ్మకాలు జరిగినట్టు సీబీఆర్ఈ పేర్కొన్నది. రెండో స్థానంలో ముంబై (35 శాతం), మూడో స్థానంలో హైదరాబాద్ (18 శాతం) నిలిచాయి. పుణెలో 4 శాతం విక్రయాలు నమోదవగా.. బెంగళూరు, చెన్నై, కోల్కతా నగరాలు ఆ తర్వాతి స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశీయ మెట్రో నగరాల్లో లగ్జరీ ఇండ్లకు ఇంకా గిరాకీ పెరుగుతుందనే అంచనా వేస్తున్నాం. పండుగ సీజన్, సేల్స్ను పెంచుకోవడానికి డెవలపర్లు ఇచ్చే ఆఫర్లు, గృహ రుణాలపై స్థిరంగా ఉన్న వడ్డీరేట్లు కలిసిరావచ్చు.
-అన్షుమన్ మ్యాగజైన్, సీబీఆర్ఈ చైర్మన్