SEBI-Sahara | సహారా అధినేత సుబ్రతా రాయ్ (Subrata Roy) మరణించడంతో ఆ సంస్థపై ఉన్న కేసులపై సెబీ చైర్ పర్సన్ మధాబీ పూరీ బుచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణించినా కేసులు యధాతథంగా కొనసాగుతాయని ప్రకటించారు. ముంబైలో జరిగిన ఫిక్కీ సమావేశం వద్ద మధాబీ పూరీ బుచ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఒక సంస్థ అధినేత జీవించి ఉన్నా, లేకున్నా.. దానిపై ఉన్న కేసులు యథాతథంగా కొనసాగుతాయి’ అని చెప్పారు.
రెండు సహారా గ్రూప్ అనుబంధ సంస్థలు- సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్ఐఆర్ఈసీఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్మెంట్ కార్పొరేషన్ (ఎస్హెచ్ఐసీఎల్) ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయని, సెబీ చట్టాలను ఉల్లంఘించాయన్న ఆరోపణలపై ‘సెబీ, సహారా’ మధ్య సుదీర్ఘ కాలంగా న్యాయ పోరాటం సాగుతోంది.
సహారా సంస్థల నిధుల సేకరణ పద్దతులపై 2008లో సెబీ దర్యాప్తు ప్రారంభించింది. సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టిబుల్ డిబెంచర్స్ (ఓఎఫ్సీడీస్) జారీ చేయడంపై సెబీ కన్నెర చేసింది. మూడు కోట్ల మంది మదుపర్ల నుంచి సేకరించిన నిధులను రీఫండ్ చేయాలని 2011లో సహారా గ్రూప్ సంస్థలు- ఎస్ఐఆర్ఈఎల్, ఎస్హెచ్ఐసీఎల్లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై మొదలైన న్యాయ పోరాటం సుప్రీంకోర్టుకు చేరింది.
2012 ఆగస్టు 31న సెబీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. మదుపర్ల నుంచి సేకరించిన నిధులపై 15 శాతం వడ్డీతో వారికి చెల్లించాలని సహారా అనుబంధ సంస్థలు ఎస్ఐఆర్ఈఎల్, ఎస్హెచ్ఐసీఎల్ లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫలితంగా ఇన్వెస్టర్లకు సొమ్ము రీఫండ్ చేసేందుకు రూ.25 వేల కోట్ల నిధులను సెబీ వద్ద సహారా డిపాజిట్ చేసింది. కానీ, నాటి నుంచి ఇప్పటి వరకూ మదుపర్లకు సెబీ రూ.138 కోట్లు మాత్రమే రీఫండ్ చేసింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి ఇన్వెస్టర్లు సమర్పించిన ఆధారంగా పేమెంట్స్ జరుగుతున్నాయని మాధాబీ పురీ బుచ్ చెప్పారు.
Subrata Roy | ఆ 25 వేల కోట్ల సంగతేంటి? సుబ్రతారాయ్ మృతితో సహారా నిధులపై పెరిగిన ఫోకస్