Russia-Ukraine War | రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సెమీకండక్టర్ కష్టాలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే కరోనా నేపథ్యంలో తలెత్తిన చిప్ల కొరత.. స్మార్ట్ఫోన్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను వేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు చిప్ల తయారీకి వినియోగించే కీలక ముడి సరకుల రవాణాను యుద్ధం ఆటంకపరుస్తున్నది. అంతర్జాతీయంగా పల్లాడియం సరఫరాలో రష్యా వాటానే అత్యధికంగా 44 శాతం. ఇక నియోన్ సరఫరాలో ఉక్రెయిన్ వాటా 70 శాతంగా ఉన్నది. చిప్ల తయారీకి ఈ రెండూ అత్యంత అవసరమైనవే. దీంతో ఈ ఇరు దేశాల యుద్ధం వీటి సరఫరాకు బ్రేకులు వేసిందిప్పుడు. ఫలితంగా వాహనాలతోపాటు స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు తదితర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ధరలూ పెరిగే వీలుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. 2014-15లోనూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల చిప్ పరిశ్రమ దెబ్బతిన్నది.
రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ.. దేశీయ మార్కెట్లో వంటనూనెల ధరల్ని అమాంతం పెంచవచ్చన్న ఆందోళనలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ యుద్ధంతో ఎన్నో దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతున్నాయని, రాబోయే రోజుల్లో భారత్లోనూ వంటనూనెల ధరలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు పరుగులు పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ నుంచే భారత్కు 80 శాతం సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతుందని గుర్తుచేస్తున్నారు. ఈ యుద్ధంతో సదరు దిగుమతులపై సహజంగానే ప్రభావం ఉంటుందని, అది ధరల పెంపునకు దారితీస్తుందని విశ్లేషిస్తున్నారు.