ముంబై, డిసెంబర్ 13: రూపాయి మారకపు విలువ మూడు వారాల క్రితం నమోదుచేసిన రికార్డు కనిష్ఠస్థాయికి తిరిగి బుధవారం మరోసారి చేరింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో బలహీనంగా ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో ఆల్టైమ్ కనిష్ఠస్థాయి 83.42 వద్దకు పడిపోయి, చివరకు క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 3 పైసలు నష్టపోయి 83.40 వద్ద ముగిసింది. గత నవంబర్ 24న ఇదేస్థాయి వద్ద భారత కరెన్సీ నిలిచింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో డాలరు బలపడిందని, దీంతో రూపాయి తగ్గిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 5.55 శాతానికి పెరగడం సైతం కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. ప్రపంచ మార్కెట్లో బ్యారల్ ముడి చమురు ధర 73 డాలర్ల వద్దకు తగ్గిన కారణంగా రూపాయి క్షీణత పరిమితంగా ఉందని ట్రేడర్లు వివరించారు. తాజాగా డాలర్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగి 104.50 వద్ద కదులుతున్నది.
83.20-83.70 శ్రేణి మధ్యలో ఒడిదుడుకులు
యూరో, జపాన్ యెన్లు లాభపడుతున్న కారణంగా డాలర్ ఇండెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నదని, సమీప భవిష్యత్తులో రూపాయి సైతం 83.20-83.70 నిర్ణీత శ్రేణిలో ఒడిదుడుకులకు గురవుతుందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి అంచనా వేశారు. రూపాయి మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని, 83.50 స్థాయి వద్ద మద్దతు ఉన్నదని, ఈ స్థాయిని బ్రేక్చేస్తే మరింత బలహీనపడి వచ్చే కొద్ది రోజుల్లో 83.90-84.20 శ్రేణి వరకూ తగ్గవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.