న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: రూపాయి విలువ మరో రోజు నిట్టనిలువునా పతనమయ్యింది. అమెరికా కరెన్సీ మరింత బలపడటంతో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో 58 పైసలు క్షీణించి ఆల్టైమ్ కనిష్ఠస్థాయి 81.67 వద్ద ముగిసింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు భారీగా పెంచనున్నట్లు సంకేతాలివ్వడంతో ఈక్విటీ, బాండ్ మార్కెట్ నుంచి ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నిధుల్ని తరలించడం రూపాయి పతనానికి ప్రధాన కారణమని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. రూపాయి క్షీణించడం వరుసగా ఇది నాల్గో రోజు. ఈ 4 రోజుల్లో దేశీ కరెన్సీ 193 పైసల మేర నష్టపోయింది.
ఆర్థిక మాంద్యం పట్ల భయాలు, ఫెడ్ కఠిన వైఖరితో డాలర్ అనూహ్యంగా బలపడిందని, దీంతో రిస్క్తో కూడిన ఆస్తుల నుంచి బయటపడేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు. డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ పెరుగుదల కారణంగా సమీప రోజుల్లో డాలర్-రూపాయి పెయిర్ 82 స్థాయికి చేరుతుందని, 81.05 సమీపంలో మద్దతు లభిస్తున్నదని అంచనా వేశారు. అమెరికా డాలర్ పటిష్టతను తెలిపే డాలర్ ఇండెక్స్ కొత్త రికార్డుస్థాయి 113.71 వద్దకు చేరింది. ఈ వారాంతంలో వెల్లడికానున్న రిజర్వ్బ్యాంక్ పాలసీపై మార్కెట్ దృష్టినిలిపిందని విశ్లేషకులు తెలిపారు. సెప్టెంబర్ 28-30 మధ్య ఆర్బీఐ కమిటీ సమీక్షా సమావేశం జరుగుతుంది.
బీవోపీ దెబ్బతో 82.50 స్థాయికి!
భారత్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (బీవోపీ- దేశం ఇచ్చి పుచ్చుకునే చెల్లింపుల మధ్య వ్యత్యాసం) లోటు ఏర్పడుతున్నందున రూపాయి 82.50 స్థాయికి పడిపోతుందని ఐడీఎఫ్సీ ఫస్ట్బ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఒక రీసెర్చ్ నోట్లో తెలిపింది. అమెరికా ఫెడ్ రేట్ల పెంపుతో రానున్న రోజుల్లో సైతం డాలర్ పటిష్టంగా ఉంటుందని, ఫెడ్ వడ్డీ రేట్లను 4.6 శాతం వరకూ పెంచవచ్చని అంచనా వేస్తున్నట్టు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎకానమిస్ట్ గౌరవ్సేన్ గుప్తా చెప్పారు. ప్రస్తుతం ఫెడ్ రేటు 3-3.25 శాతం వద్ద ఉంది. డాలర్ బలపడటం, బీపీవో లోటు ఏర్పడటం రూపాయిని ఒత్తిడికి లోనుచేస్తాయన్నారు.
అలాగే ఎగుమతులు మరింత తగ్గితే కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 3.5-4 శాతం వరకూ పెరుగుతుందని వివరించారు. మరోవైపు దేశీ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్ఫోలియో నిధులు తరలివెళతాయని అంచనా వేస్తున్నామన్నారు. కరెంటు ఖాతా లోటు పెరగడం, పోర్ట్ఫోలియో నిధుల తరలింపులతో బీవోపీ లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 63 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని సేన్గుప్తా తెలిపారు.