ముంబై, సెప్టెంబర్ 7: భారత్ కరెన్సీ పతనం అదేపనిగా కొనసాగుతున్నది. డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా నాలుగో రోజూ క్షీణించింది. గురువారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో మరో 10 పైసలు నష్టపోయి కొత్త కనిష్ఠస్థాయి 83.23 వద్ద ముగిసింది. ఈ స్థాయి వద్ద ముగియడం చరిత్రలో ఇదే తొలిసారి. గత ఏడాది అక్టోబర్లో ఇంట్రాడేలో నమోదుచేసిన 83.29 స్థాయికి మరో 7 పైసల సమీపంలో ప్రస్తుతం భారత కరెన్సీ విలువ ఉంది. క్షీణతకు ఫారెక్స్ డీలర్లు వెల్లడిస్తున్న కారణాలివి..
రూపాయి మరింత తగ్గే అవకాశం ఉందని ఫారెక్స్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్లో వెల్లడయ్యే జాబ్లెస్ క్లెయింలపై ప్రస్తుతం ఫారెక్స్ మార్కెట్ దృష్టి ఉందని, ఈ నేపథ్యంలో రూపాయి 83.40 వరకూ తగ్గవచ్చని, వచ్చే కొద్ది రోజుల్లో ఇది 83.05-83.40 శ్రేణిలో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫారెక్స్ అనలిస్ట్ గౌరాంగ్ సోమయ్య చెప్పారు. డాలర్ పటిష్ఠత, గరిష్ఠ క్రూడ్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం, యూరప్, చైనా ఆర్థిక గణాంకాల నిరుత్సాహపరుస్తున్నందున, సమీప భవిష్యత్తులో రూపాయి నెగిటివ్గానే ట్రేడవుతుందని బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అంచనా వేశారు.
దేశీయ ఫండ్స్ కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ కొద్దిరోజులుగా పెరుగుతున్నప్పటికీ, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) అమ్మకాల వేగం పెంచారు. గత మూడు రోజుల్లో రూ.8,200 కోట్లు వెనక్కు తీసుకున్న గురువారం మరో రూ.758 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 90.50 డాలర్ల స్థాయికి పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ తాజాగా 385 పాయింట్ల లాభంతో 66,265 పాయింట్ల వద్దకు చేరింది.