ముంబై, అక్టోబర్ 7: రూపాయి వరుస పతనం కొనసాగుతున్నది. తాజాగా డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మరో 13 పైసలు నష్టపోయి కొత్త కనిష్ఠస్థాయి 82.30 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో 82.19 స్థాయి నుంచి బలహీనంగా ట్రేడింగ్ ప్రారంభించిన రూపాయి ఒకదశలో గతంలో ఎన్నడూ చూడని 82.43 స్థాయికి జారిపోయింది. చివరకు కొంత నష్టాన్ని పూడ్చుకుని, 82.30 స్థాయి వద్ద నిలిచింది. క్రితం రోజు భారత కరెన్సీ 55 పైసల భారీ పతనాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ వారం మొత్తంమీద 90 పైసలు (1.11 శాతం) కోల్పోయింది. చమురు ఉత్పాదక దేశాల మండలి ఒపెక్ క్రూడ్ ఉత్పత్తిలో కోత విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఇంధనం బ్యారల్ ధర 95 డాలర్ల స్థాయిని దాటడం, అమెరికా బాండ్ ఈల్డ్ పెరగడం తదితర అంశాలు రూపాయిని పడగొట్టాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
చమురు ధరలు పెరుగుతూ ఉంటే స్వల్పకాలంలోనే రూపాయి 85 స్థాయికి పతనం అయ్యే అవకాశాలున్నాయని పీడబ్ల్యూసీ పార్టనర్ రానెన్ బెనర్జీ చెప్పారు. రానున్న రెండు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి మారకపు విలువ 83 స్థాయికి తగ్గవచ్చని, 81.50 స్థాయి మద్దతుగా నిలుస్తుందని బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అంజు చౌధురి చెప్పారు.