ముంబై, ఆగస్టు 11: క్రితం రోజు కోలుకున్న రూపాయి శుక్రవారం వెనువెంటనే పతనమయ్యింది. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ తగ్గడం, యూఎస్ డాలరు బలపడిన నేపథ్యంలో భారత కరెన్సీ విలువ 19 పైసలు నష్టపోయి, 82.82 వద్ద ముగిసింది. గురువారం డాలరు మారకంలో 19 పైసలు కోలుకున్న రూపాయి తాజాగా రెండంకెల స్థాయిలో నష్టాన్ని చవిచూడటం గమనార్హం. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో 82.75 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 82.87 స్థాయికి సైతం పడిపోయింది.
ముడి చమురు ధరలు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో రిస్క్ సాధానలకు ఇన్వెస్టర్లు దూరం జరుగుతున్నందున సమీప భవిష్యత్తులో రూపాయి 83 స్థాయికి తగ్గవచ్చని ఫారెక్స్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూలై నెలలో యూఎస్ ద్రవ్యోల్బణం నెమ్మదించినందున డాలర్ బలపడుతున్నదని, వచ్చే కొద్దిరోజులూ నెగిటివ్గానే రూపాయి ట్రేడవుతుందని బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి తెలిపారు. రానున్న రోజుల్లో 82.40-83.30 మధ్య రూపాయి హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని అంచనా వేశారు. డాలర్ ఇండెక్స్ 0.15 శాతం మేర పెరిగి 102.7 స్థాయికి చేరింది. బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 87 డాలర్ల సమీపంలో ట్రేడవుతున్నది.
దేశంలో విదేశీ మారకం నిల్వలు అంతకంతకూ పడిపోతున్నాయి. వరుసగా మూడో వారంలోనూ క్షీణతే నమోదైంది. ఈ నెల 4తో ముగిసిన వారంలో మరో 2.417 బిలియన్ డాలర్లు దిగజారి 601.453 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ రిజర్వులు పరిమితమైయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలియజేసింది. అంతకుముందు వారంలోనైతే 3.165 బిలియన్ డాలర్లు పతనమైయ్యాయి. కాగా, దేశీయ ఫారెక్స్ రిజర్వుల్లో ఎక్కువ భాగమైన ఫారిన్ కరెన్సీ ఆస్తులు ఈసారి 1.937 బిలియన్ డాలర్లు తగ్గి 533.40 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇక బంగారం నిల్వలు 224 మిలియన్ డాలర్లు దిగి 44.68 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ తెలియజేసింది.