ముంబై: ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్లో రూపాయి పతనం కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం జరిగిన ట్రేడింగ్లో అమెరికన్ డాలర్తో పోల్చితే ఇండియన్ రూపీ 38 పైసలు కోల్పోయింది. దాంతో అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలువ రూ.81.78 పైసలకు పడిపోయింది. శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఇండియన్ రూపీ వాల్యూ రూ.81.36 పైసల వద్ద ముగిసింది.
అంతర్జాతీయంగా ఒపెక్ ముడి చమురు ధరలను పెంచడం, అమెరికన్ ఫెడ్ రిజర్వ్ వరుసగా మూడు ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో వడ్డీరేట్లను హైక్ చేయడం కారణంగా రూపాయి పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగడం రూపాయిపై ఒత్తిడి పెంచాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం నాటి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కూడా వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. గత మే నెల నుంచి ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచడం ఇది వరుసగా నాలుగోసారి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం ఆర్బీఐ గడిచిన ఐదు నెలల్లో వడ్డీ రేట్లను 190 బేసిస్ పాయింట్లు పెంచినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు.