న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దేశీయ సదస్సుల్లోనూ, అంతర్జాతీయ వేదికలపైనా ఇతర దేశాల కరెన్సీలకంటే రూపాయి మెరుగ్గా ఉన్నదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఊదరగొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు సైతం ఇదే వల్లెవేస్తున్నారు. వారంతా వాదనలు విన్పించిన కొద్ది రోజులకే డాలరు మారకంలో రూపాయి విలువ మరో కొత్త కనిష్ఠస్థాయి 83 వద్దకు పడిపోయింది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ 11.75 శాతం దేశీ కరెన్సీ పతనమయ్యింది. ఒకే ఏడాదిలో ఇంతగా క్షీణించడం ఇదే ప్రధమం. 2013లో 11 శాతం పతనాన్ని చూసిన రూపాయి ఈ రికార్డును ఇప్పుడు తిరగరాసింది.
నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి ఇప్పటివరకూ రూపాయి భారీగా 42.17 శాతం పతనాన్ని చవిచూసింది.
రిజర్వ్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోకపోతే ఏ స్థాయికైనా రూపాయి పడిపోవచ్చు
-ఒక ప్రైవేటు బ్యాంకు ఫారెక్స్ ట్రేడర్