2023 New Rules | 2022కి వీడ్కోలు పలికి కొత్త వసంతాని (2023 ) కి స్వాగతం పలుకుతున్న వేళ.. పలువురు కొత్త కొత్త ప్లాన్లు వేసుకుని ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక అంశాలపై ప్లాన్లు రూపొందించుకుని ఉంటారు. అయితే, కొత్త సంవత్సరంలో ఆర్థిక పరంగా వచ్చే మార్పులు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి కేవైసీ పత్రాల సమర్పణ మొదలు.. ఎన్పీఎస్ పాక్షిక విత్ డ్రాయల్స్, క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్లలో కోత వంటి పలు మార్పులు రానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..
జీవిత బీమా మొదలు హెల్త్, మోటార్, ట్రావెల్, హౌసింగ్ బీమా పాలసీలను కొనుగోలు చేసే వారికి 2023 జనవరి ఒకటో తేదీ నుంచి కేవైసీ పత్రాలు సమర్పించడం ఐఆర్డీఏఐ తప్పనిసరి చేసింది. ఇప్పుడు హెల్త్ బీమా తీసుకుంటున్న వారు రూ.లక్ష, అంతకంటే ఎక్కువ క్లయిమ్ చేస్తున్న వినియోగదారులే కేవైసీ పత్రాలు సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి కేవైసీ పత్రాలు తప్పనిసరి కాదు. కానీ, ఇక అన్నీ బీమా పాలసీలకు తప్పనిసరిగా కేవైసీ పత్రాలు సమర్పించాల్సిందే.
కేంద్ర ప్రభుత్వోద్యోగులు సబ్స్క్రైబర్లుగా ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో ఆదివారం (2023 జనవరి 1) నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లు పాక్షికంగా విత్డ్రా చేసుకోవాలనుకుంటే నోడల్ ఆఫీసు ద్వారా రిక్వెస్ట్ పంపాల్సిందే. అందుకు సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా ఇవ్వాలి. ఇప్పటి వరకు పాక్షిక విత్ డ్రాయల్స్కు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోయేది.
కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే క్రెడిట్ కార్డుల యూజర్లకు షాక్ ఇచ్చే నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్లో క్రెడిట్ కార్డుతో ఆన్లైన్ కొనుగోళ్లు జరిపితే ఇచ్చిన రివార్డు పాయింట్లలో ఎస్బీఐ కోత విధించింది. ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ సైతం రివార్డు పాయింట్ల రిడీమ్పై పరిమితులు తీసుకొచ్చింది.
బ్యాంకు లాకర్ల నిర్వహణకు ఆర్బీఐ కొత్త నిబంధనలు కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి తెస్తున్నది. 2022 ప్రారంభంలోనే కొత్త నిబంధనలు అమలు చేసినా.. గత ఆగస్టులో వాటిని సమీక్షించి మార్పులు చేసింది. అలా మార్పులు చేసిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే బ్యాంకుల్లో లాకర్ ఫెసిలిటీ వినియోగించుకుంటున్న ఖాతాదారులు తమ ఒప్పందాలను రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంకులు సూచించారు.
ప్రతియేటా జనవరిలో మాదిరిగానే కొత్త సంవత్సరంలోనూ కార్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, టాటా మోటార్స్, అడి, మెర్సిడెస్ బెంజ్ తదితర కార్ల తయారీ సంస్థలు జనవరి నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కార్ల ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ధరలు సవరిస్తున్నామని కార్ల తయారీ సంస్థలు పేర్కొన్నాయి.