New Year Celebrations | మరో 24 గంటల్లో కొత్త వసంతం ప్రారంభం కాబోతున్నది. ప్రతి ఒక్కరి జీవిత కాలంలో ఏయేటికాయేడు స్పెషల్ ఈవెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ నూతన వసంత వేడుకలను అద్భుతంగా జరుపుకోవాలని భావిస్తారు. కొందరు ఇండ్లలోనే కుటుంబ సమేతంగా వేడుక జరుపుకుంటే మరికొందరు పర్యాటక ప్రదేశాల్లో నిర్వహించుకుంటారు. సంపన్నులు, సెలబ్రిటీలు దేశంలోని రిసార్ట్లు, ఫామ్ హౌజ్ల్లో సరదాగా గడుపుతారు. హోటళ్లు, రిసార్ట్లు, పామ్హౌజ్లు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.
సొంత రిసార్ట్లు, ఫామ్ హౌజ్లు లేని వారు ‘న్యూఇయర్ సెలబ్రేషన్స్’ కోసం హోటళ్లు, రిసార్ట్ గదులు అద్దెకు తీసుకుంటారు. అందుకోసం ఒక్క రాత్రి గడిపేందుకు హోటల్ లేదా రిసార్ట్ గది అద్దె రూ.లక్షల్లో చెల్లించేందుకు కూడా వెనుకాడరు. డిసెంబర్ 31న దేశంలోని ప్రముఖ నగరాల పరిధిలోని బ్రాండెడ్ హోటళ్లలో కొన్ని రూమ్ల అద్దెలు ఆల్ టైం గరిష్ట స్థాయికి పెరిగాయి. ఢిల్లీ, జైపూర్, ఉదయ్పూర్ నగరాల్లోని లీలా ప్యాలెస్ హోటల్స్ & రిసార్ట్స్ అద్దెలు రికార్డు గరిష్ట స్థాయికి పెరిగాయని ఓ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్ హోటళ్లలో ఈ నెల 31న గదులు ఖాళీ లేవని, క్రిస్మస్ సందర్భంగా ఒక రాత్రి బస చేయడానికి రూ.1,06,200 చెల్లించాల్సి ఉంటుందని బుకింగ్ డాట్ కాం ఇంతకుముందు వెల్లడించింది.
రాజస్థాన్ లోని సిక్స్ సెన్స్ పోర్ట్ బార్వారాలో డిసెంబర్ 31 రాత్రి గది అద్దె రూ.1.20 లక్షలు పలుకుతుందని సంస్థ కమర్షియల్ డైరెక్టర్ రజత్ గెరా తెలిపారు. ‘మా హోటల్లోని మహారాజా షూట్ బుకింగ్ కోసం పలువురు ఎంక్వైరీ చేశారు. ఒక రాత్రి బస చేయడానికి అద్దె రూ.7 లక్షలు పలుకుతుంది. దేశీయ పర్యాటకులు ఆలస్యంగా హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడం, విదేశీ పర్యాటకులు పోటెత్తడంతో వాటి అద్దెలు గణనీయంగా పెరుగుతాయి. ముందస్తుగా హోటల్ రూమ్స్, రిసార్ట్లు బుక్ చేసుకోని వారు అధిక మొత్తం అద్దె చెల్లించేందుకు సిద్ధం అవుతున్నారన్నారు.
సిక్స్ సెన్స్ ఫోర్ట్ బార్వారాలో ఒక రూమ్ రెంట్ రూ.1.2 లక్షలు పలికితే, మహారాజా షూట్ బుక్ చేసుకున్న వారు రూ.7 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. ఉదయ్ పూర్ లోని జనా లేక్ రిసార్ట్లో రెండు రాత్రులు బస చేయాలంటే రూ.55 వేలు, జైపూర్ లోని ఫెయిర్ మాంట్ హోటల్ గదికి రూ.65 వేలు, జైపూర్ లీలా ప్యాలెస్ హోటల్ రూమ్ అద్దె రూ.31,683 చెల్లించాల్సి ఉంటుంది. గోవా రాజధాని పనాజీలోని హిల్టన్ డబుల్ ట్రీ, హిల్టన్ గోవా రిసార్ట్ కండోలిం, గోవా ఆర్పొరా బాగా హిల్ట్ డబుల్ ట్రీ హోటల్ గదుల అద్దెలు చారిత్రక గరిష్టస్థాయికి దూసుకెళ్లాయని గోవా హిల్టన్ హోటల్స్ క్లస్టర్ కమర్షియల్ డైరెక్టర్ ఆకాశ్ కాలియా తెలిపారు.
ఇంటర్నేషనల్ బోర్డర్ల పున: ప్రారంభం, కొత్త రూట్లలో అంతర్జాతీయ విమాన సర్వీసుల పున: ప్రారంభం వంటి అంశాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వచ్చే వారి తాకిడితో హోటళ్ల గదుల అద్దెలు పెరిగిపోతున్నాయని కాలియా చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్ చార్జీలు సగటున 40 శాతం పెరిగాయని హిల్టన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తొలానీ తెలిపారు.