Retirement Fund | ఎవరే ఉద్యోగం చేసినా.. 58 నుంచి 60 ఏండ్ల వయస్సు దాటాక రిటైర్ కావాల్సిందే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది ఒక సామెత. ఉద్యోగం నుంచి రిటైరయ్యాక నిర్దిష్ట ఇన్కం ఉండదు. కనుక జాబ్ చేస్తుండగానే రిటైర్మెంట్ తర్వాత ఇన్కం కోసం డబ్బు పొదుపు చేస్తూ ఉండాలి. రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటుతో ముదిమి వయస్సులో పిల్లలపైన ఆధారపడకుండా ప్రశాంతంగా జీవించొచ్చు.
చాలా మంది రిటైర్మెంట్కు చాలా టైం ఉందని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ వాయిదా వేస్తారు. ఫైనాన్సియల్ టార్గెట్స్లో ‘ఫ్యూచర్ పెట్టుబడు’ల అంశం లాస్ట్ చాయిస్గా పెట్టుకుంటారు. అలా కాకుండా జాబ్లో చేరగానే రిటైర్మెంట్ ఫండ్ కోసం కొంత మొత్తం కేటాయంచాలని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ఇండియాలో రిటైర్మెంట్ వయస్సు అరవయ్యేండ్లు. ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వారు 58 ఏళ్లకే రిటైర్ కావాల్సిందే. కనుక జాబ్లో చేరిన మొదట్లో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే, కాంపౌండింగ్ వడ్డీ ప్రభావంతో ఎక్కువ మొత్తం నిధి సమకూర్చుకోవచ్చు. వివిధ పథకాల్లో వచ్చిన వడ్డీ ఆదాయాన్ని మళ్లీ పెట్టుబడి పెట్టడంతో మరింత ఆదాయం పొందొచ్చు.
ఉదాహరణకు వెంకటరమణ 25 ఏండ్ల వయస్సులోనే ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి ఈక్విటీ-మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాడనుకుందాం.. రిటైర్మెంట్కు 25 ఏండ్ల టైం ఉంటుంది. నెలకు రూ.5000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి ఏటా ఐదు శాతం చొప్పున పెంచుకుంటూ పోయారనుకుందాం.. 10-12 శాతం ఆదాయంతో రిటైర్మెంట్ వయస్సు నాటికి సుమారు రూ.3.59- 5.20 కోట్ల మధ్య నిధి పొందొచ్చు.
ఒకవేళ ఐదేండ్లు ఆలస్యంగా అంటే 30 ఏండ్లకు పెట్టుబడి పెడితే ఏటా రెట్టింపు పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. అలా కాక 35 ఏండ్ల వయస్సులో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే రిటైర్మెంట్ నాటికి 25 ఏండ్ల టైం ఉంటది. అటువంటప్పుడు నెలకు రూ.18 వేల చొప్పున పొదుపు చేయాలి. 25 ఏండ్ల వయస్సులోనే పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే రూ.55 లక్షలు.. 30 ఏండ్ల నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే రూ.80 లక్షలు, 35 ఏండ్లకు మదుపు చేయడం అంటే సుమారు రూ.కోటి వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు.