Rolls-Royce | బ్రిటన్కు చెందిన కార్లు, విమానాల ఇంజిన్ల తయారీ సంస్థ `రోల్స్ రాయిస్ (Rolls-Royce)` పొదుపు చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 2,500 మంది ఉద్యోగులపై వేటు వేయాలని ప్రణాళిక రూపొందించింది. మొత్తం సిబ్బందిలో సుమారు ఆరు శాతం ఉంటారు. సంస్థను పూర్తిగా క్రమబద్ధీకరించేందుకు 2000 నుంచి 2,500 మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక వేశామని రోల్స్ రాయిస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు రోల్స్ రాయిస్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్బిల్జిక్ తెలిపారు. భవిష్యత్ పరిస్థితులకు అనుగుణంగా రోల్స్ రాయిస్’ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని అన్నారు. కస్టమర్లు, భాగస్వాములు, వాటాదారులకు మరింత మెరుగైన, శక్తిమంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ప్రొక్రూర్ మెంట్, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ విభాగాలతోపాటు ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ రంగాల్లో బలోపేతం చేయాలన్న లక్ష్యంతో సంస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు రోల్స్ రాయిస్ తెలిపింది. సంస్థ మాజీ సీఈఓ వారెన్ ఈస్ట్ 2020 నుంచి 9000 మందికి పైగా ఇంటికి సాగనంపారు. కొత్త సీఈఓ వచ్చిన తర్వాత గత ఆగస్టులో రోల్స్ రాయిస్ నికర లాభం గతేడాదితో పోలిస్తే 160 కోట్ల యూరోల నుంచి 120 కోట్ల యూరోలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో మరో 2000-2500 మంది ఉద్యోగుల ఉద్వాసనకు రోల్స్ రాయిస్ సిద్ధ పడటం ప్రాధాన్యం సంతరించుకున్నది.