ఒమిక్రాన్తో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్కు మరోసారి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా ప్రీమియం ధరలు పెరుగుతుండటం ఒకింత కలవరపెడుతున్నది. దీంతో వీలైనంత త్వరగా పాలసీలు తీసుకోవడం మంచిదని అటు ఆర్థిక నిపుణులు, ఇటు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్లను తీసుకునేవారి సంఖ్య ఇప్పుడు పెరుగుతున్నది. కాబట్టి ఇప్పటికే బీమా ఉంటే దాన్ని సమీక్షించండి. దాని కవరేజిని పెంచుకోండి. గడువుకు ముందే రెన్యువల్ చేయడం మరువద్దు. నిజానికి పాలసీల ప్రీమియంలు ఇప్పటికే పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు డిసెంబర్లోనే బీమా ప్రీమియంలను పెంచాయి. బజాజ్ అలయాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇటీవలే ప్రీమియంలను పెంచింది. మిగతా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలూ త్వరలో పెంచనున్నాయి. దీంతో ప్రీమియం ధర కనీసం 30 శాతం వరకు పెరిగే అవకాశాలున్నట్టు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎందుకు పెరుగుతున్నాయి?
బీమా సంస్థలు అండర్ రైటింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తుండటమే దీనికి కారణం. ఇక నుంచి ఎంత బీమాకు.. ఎంత ప్రీమియం వసూలు చేయాలనే నియమాలు వస్తాయి. పైగా గతేడాదే రీఇన్సూరెన్స్ వ్యయాలను పెంచనున్నట్టు రీఇన్సూరెన్స్ కంపెనీలు తెలిపాయి. అయినప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఇస్తున్న కంపెనీలు పెరిగిన రీఇన్సూరెన్స్ వ్యయాలను కొంతవరకు తగ్గించి పాలసీలను జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా రిస్క్ అధికంగా ఉన్న ప్రాంతాలను మినహాయించి టర్మ్ పాలసీలను తక్కువ సంఖ్యలో జారీ చేయాలని కొన్ని బీమా సంస్థలు నిర్ణయించడం గమనార్హం.
ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి
పాలసీని జారీచేసే ముందు మెడికల్ టెస్టులు తప్పనిసరి చేయనున్నారు. అలాగే మెడికల్ టెస్టులు చేసిన తర్వాతే లాప్స్ అయిన పాలసీలను రెన్యువల్ చేస్తారు. మెడికల్ టెస్టులనుబట్టి రెన్యువల్ చేయాలా?.. లేదా?.. అనే విచక్షణ కూడా బీమా కంపెనీలదే. ఇక చాలామంది బీమా అవసరాన్ని తక్కువగా అంచనా వేస్తారు. ఎంత బీమా కవరేజి ఉండాలనేదానిపై అనేక సందేహాలుంటాయి. అయితే బీమాను తీసుకునే ముందు ఈ చిన్న లెక్క వేసుకుంటే చాలు. టర్మ్ పాలసీ తీసుకుంటున్నట్టయితే మీ వార్షిక వేతనానికి 15 రెట్లు బీమా ఉండాలి. వార్షిక వేతనం రూ.5 లక్షలు ఉంటే రూ.50 లక్షలకు బీమా కవరేజి ఉండాలి.