న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్ లేదా వైజాగ్ స్టీల్).. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్)తో జట్టు కట్టింది. వర్కింగ్ క్యాపిటల్ మద్దతు, ముడి సరకు సరఫరాకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు వివిధ ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఆర్ఐఎన్ఎల్ సీఎండీ అతుల్ భట్ తాజాగా ప్రకటించారు. నిలిచిపోయిన మూడో బ్లాస్ట్ ఫర్నేస్ పునరుద్ధరణకు తమ ఈ ఒప్పందం దోహదపడగలదని వివరించారు. కాగా, 2021 జనవరిలో ఈ బ్లాస్ట్ ఫర్నేస్ మూతబడింది. తాజా అగ్రిమెంట్ నేపథ్యంలో ఈ నెల 30న దీన్ని తిరిగి ప్రారంభించాలని సంస్థ చూస్తున్నది.
దీని హాట్ మెటల్ సామర్థ్యం నెలకు 2 లక్షల టన్నులని భట్ చెప్పారు. ఇక ఈ ఒప్పందం కింద అడ్వాన్స్ వర్కింగ్ క్యాపిటల్ రూపంలో లేదా మూడో బ్లాస్ట్ ఫర్నేస్ పునరుద్ధరణకు అవసరమైన ముడి సరకు కోసం రూ.800-900 కోట్లను ఆర్ఐఎన్ఎల్కు జేఎస్పీఎల్ అందించనున్నది. దీనికి బదులుగా ప్రతినెలా జేఎస్పీఎల్కు సుమారు 90వేల టన్నుల కాస్ట్ బ్లూమ్స్ను ఆర్ఐఎన్ఎల్ సరఫరా చేయనున్నది. ఒప్పందంతో సంస్థ నెలవారీ సేల్స్ టర్నోవర్ సుమారు రూ.500 కోట్లు పెరుగుతుందని, ఇది కంపెనీ నష్టాలను నెలకు రూ.50-100 కోట్లను తగ్గించగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా భట్ వెలిబుచ్చారు.