న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మంగళవారం రెండు సానుకూల వార్తలు వెలువడ్డాయి. రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టగా, పారిశ్రామికోత్పత్తి పుంజుకుంది. సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతానికి దిగివచ్చినట్లు నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయ్యింది. ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు తగ్గడంతో ఇది సాధ్యపడింది. 2020 సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.27 శాతంకాగా, ఈ ఏడాది ఆగస్టులో ఇది 5.30 శాతం. సెప్టెంబర్ నెలలో కూరగాయల ధరలు భారీగా 22.47 శాతం మేర తగ్గాయి. పండ్లు, పప్పుదినుసులు ధరలు కూడా తగ్గాయి. అయితే ఇంధన, విద్యుత్ ధరలు 13.63 శాతం పెరిగాయి.
ఈ ఏడాది ఆగస్టు నెలలో పారిశ్రామికోత్పత్తి 11.9 శాతం వృద్ధిచెందినట్లు ఎన్ఎస్వో తెలిపింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో అధిక వెయిటేజి వున్న తయారీ రంగ ఉత్పత్తి 9.7 శాతం పెరగ్గా, మైనింగ్ ఉత్పత్తి 23.6 శాతం, విద్యుదుత్పత్తి 16 శాతం చొప్పున వృద్ధిచెందాయి. ఈ మూడు విభాగాల్లో ఉత్పత్తి కొవిడ్ ముందస్తుస్థాయికి చేరడం గమనార్హం.