Retail Inflation | అధిక ధరలను, దాంతోపాటు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి పలు దేశాల కేంద్రీయ బ్యాంకులు దాదాపు ఏడాది కాలంగా కీలక వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వు మొదలు, ఇంగ్లండ్ బ్యాంక్, ఆర్బీఐ కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయానికి అనుగుణంగా ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆర్బీఐకి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ కీలక సూచన చేశారు. యూఎస్ ఫెడ్ రిజర్వుకు అనుగుణంగా దేశీయంగా వడ్డీరేట్ల పెంపు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోల్కతాలో శనివారం జరిగిన ఓ చర్చాగోష్టిలో సౌమ్యకాంతి ఘోష్ సూచించారు.
యూఎస్ ఫెడ్ రిజర్వు ఇక ముందు కూడా వడ్డీరేట్ల పెంపు కొనసాగించొచ్చునని సౌమ్యకాంతి ఘోష్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్బీఐ రెపోరేట్ పెంచడంతో ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని మదింపు చేయాలని ఆర్బీఐని కోరారు. కనుక యూఎస్ ఫెడ్ రిజర్వుకు అనుగుణంగా వడ్డీరేట్లు పెంచాలన్న యోచనకు స్వస్తి పలుకాలని విజ్ఞప్తి చేశారు. కనీసం మరో మూడు దఫాలు, అంతకంటే ఎక్కువసార్లు యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు సామూహికంగా వడ్డీరేట్లు పెంచేశాయని సౌమ్యకాంతి ఘోష్ చెప్పారు. కానీ, ఆయా దేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా వడ్డీరేట్లు తగ్గించాయని, ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను పెంచే విషయమై యూఎస్ ఫెడ్ రిజర్వ్తో కలిసి వెళ్లాలా.. వద్దా.. అన్న సంగతి ఆలోచించుకోవాలన్నారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి గతేడాది మే నుంచి ఆర్బీఐ వరుసగా వడ్డీరేట్లు పెంచుతూ వస్తున్నది. ఇప్పటి వరకు 250 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచింది. జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం కూడా దాదాపు అదే స్థాయిలో ఉండొచ్చునని సౌమ్యకాంతి ఘోష్ అంచనా వేశారు. ఆర్బీఐ నిర్దేశిత స్థాయికి కంటే ఎక్కువ ద్రవ్యోల్బణం నమోదైతే, ఏప్రిల్లో మరోదఫా వడ్డీరేట్లు పెరుగుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.