న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఏది కొనాలన్నా ఉప్పూ, నిప్పే! దేశంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్! 2022 మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 6.95 శాతానికి పెరిగినట్టు స్వయానా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఇది 17 నెలల గరిష్ఠం. అంటే గత ఏడాది మార్చికంటే ఈ మార్చిలో ధరలు ఇంతగా పిరమయ్యాయన్న మాట. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది 6.07 శాతంగా ఉంది. మార్చి నెలలో ఇంతగా ధరలు పెరుగుతాయని విశ్లేషకులెవరూ అంచనా వేయలేదు. వినియోగ ధరల సూచి (సీపీఐ) ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6.35 శాతం అధికమవుతుందన్న అంచనాలు ఉండగా, అంతకు మించి ధరలు దూసుకెళ్లడం గమనార్హం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సగటు సీపీఐ ద్రవ్యోల్బణం 6.3 శాతం ఉంటుందన్న అంచనాల్ని ఇటీవల రిజర్వ్బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా వెల్లడించింది. ఆర్బీఐ నిర్దేశితస్థాయి 6 శాతాన్ని ద్రవ్యోల్బణం మించడం ఇది వరుసగా మూడో నెల. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర బ్యాంక్ ముఖ్యంగా రిటైల్ ధరలపైనే ఆధారపడుతుంది. ఇది 6 శాతానికి మించకుండా చూసే బాధ్యతను కేంద్రం..ఆర్బీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలోనే తమ సరళతర ద్రవ్య విధానాన్ని మార్చుకుంటున్నట్టు తాజా సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ సంకేతాలిచ్చింది.
ఆహారోత్పత్తులదే పోటు
మార్చి నెలలో రిటైల్ ధరల జోరుకు ప్రధానంగా ఆహారోత్పత్తులే కార ణం. సీపీఐలోని ఆహారోత్పత్తుల బాస్కెట్ ముగిసిన నెలలో 7.68 శాతం పెరిగింది. ఈ పెరుగుదల 2022 ఫిబ్రవరి నెలలో 5.85 శాతంగా ఉంది. కొద్ది వారాలుగా కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు కోరలు చాస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు వంటగ్యాస్ ధర సైతం భగ్గుమంటున్నది. మార్చిలో అన్నింటికంటే అధికంగా వంటనూనెల ధరలు 18.79 శాతం పెరగ్గా, కూరగాయలు 11.64 శాతం అధికమయ్యాయి. మాంసం, చేపల ధరలు 9.63 శాతం పిరమయ్యాయి.
పారిశ్రామికం.. ప్చ్ ఫిబ్రవరిలో స్వల్ప వృద్ధే
దేశీయ పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. వరుసగా కొన్ని నెలలుగా కోలుకున్న దేశీయ పారిశ్రామిక రంగం ఫిబ్రవరి నెలలో కేవలం 1.7 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసుకున్నది. గనులు, పవర్ జనరేషన్ రంగాలు ఆశాజనకంగా ఉండటం వల్లనే ఈ మాత్రమైన వృద్ధిని సాధించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయం వెల్లడైంది. తయారీ రంగంలో 0.8 శాతం, గనులు 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
జూన్ నుంచే రేట్ల పెంపు
రిటైల్ ద్రవ్యోల్బణం తమ అంచనాలకంటే అధికంగా పెరిగిందని, ఇప్పటికే సరళతర విధానాన్ని మార్చుకునే సంకేతాల్ని ఇచ్చిన రిజర్వ్బ్యాంక్ జూన్ నుంచే వడ్డీ రేట్లను పెంచుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. దేశంలో పెరిగిన ఇంధన ధరల ప్రభావం పూర్తిగా ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం డాటాలో కన్పిస్తుందని నైట్ ఫ్రాంక్ డైరెక్టర్ వివేక్ రాఠి అన్నారు. ఇకముందు సర్వీసుల వ్యయాలు, కార్మిక వ్యయాలు సైతం పెరుగుతాయని, సమీప భవిష్యత్తులో అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతుందన్నారు.