Smart Accounting | ముంబై, మే 29: తాము జారీచేసిన స్పష్టమైన మార్గదర్శకాలున్నప్పటికీ కొన్ని బ్యాంక్ల్లో కార్పొరేట్ పాలనా లోపాలు కన్పిస్తున్నాయని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బ్యాంక్ బోర్డుల డైరెక్టర్లలో దాస్ మాట్లాడుతూ ఆర్బీఐ మార్గదర్శకాలకు, వాస్తవంగా అమలవుతున్న కార్పొరేట్ గవర్నెన్స్ మధ్య ఉన్న అంతరాలు బ్యాంకింగ్ రంగాన్ని ఒడిదుడుకులకు లోనుచేస్తాయని హెచ్చరించారు. కొన్ని మధ్యతరహా అమెరికా బ్యాంక్లు దివాలా తీసిన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ హెచ్చరికకు ప్రాధాన్యం ఏర్పడింది.
బ్యాంక్లు చేపడుతున్న ‘స్మార్ట్ అకౌంటింగ్’ను దాస్ తీవ్రంగా విమర్శిస్తూ అది ఆర్థిక పనితీరును కృత్రిమంగా పెంచిచూపించి, ఒత్తిడిని దాచివేస్తుందన్నారు. బ్యాంక్ బోర్డులు, యాజమాన్యాలు..కార్పొరేట్ గవర్నెన్స్లో అంతరాల్ని అనుమతించరాదని, ఇది బోర్డు చైర్మన్, డైరెక్టర్ల బాధ్యత అని చెప్పారు. ఇటువంటివాటిని గతంలో ఆయా బ్యాంక్ల దృష్టికి ఆర్బీఐ కూడా తెచ్చిందని గుర్తుచేశారు.
మొండి బకాయిల్ని దాచిపెట్టాయ్
బ్యాంక్ల ‘స్మార్ట్ అకౌంటింగ్’ ఉదాహరణల్ని శక్తికాంత దాస్ వివరిస్తూ ఇద్దరు రుణగ్రస్తుల మొండి బకాయిల్ని దాచిపెట్టేందుకు..బ్యాంక్లు వాటి ఇంటర్నల్ లేదా ఆఫీస్ అకౌంట్స్ను ఉపయోగించి వారిరువురూ కలసి ఒకరి రుణాలు మరొకరు బైబ్యాక్ చేసినట్టు లావాదేవీలు సృష్టించినట్టు చెప్పారు. మొండి బకాయిల్ని మంచివిగా చూపించడానికి బ్యాంక్లు అనుసరిస్తున్న పద్ధతిని కొన్ని ఉదాహరణలతో సహా రిజర్వ్బ్యాంక్ ఎత్తిచూపగా, ఆ స్థానంలో మరో పద్ధతిని ప్రవేశపెడుతున్నాయని దాస్ చెప్పారు. ఎవరి ప్రయోజనాలకు ఇటువంటి స్మార్ట్ పద్దతులను అనుసరిస్తున్నారంటూ బ్యాంక్ బోర్డులను ప్రశ్నించారు. అయితే ఆర్బీఐ గవర్నర్ తన ప్రసంగంలో ఏ బ్యాంక్ల పేర్లనూ, రుణగ్రస్తుల పేర్లను వెల్లడించలేదు.