న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలో అత్యంత విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) విదేశీ మార్కెట్ల నుంచి భారీఎత్తున నిధులు సమీకరించింది. విదేశీ కరెన్సీ బాండ్లను జారీచేసి 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.30,000 కోట్లు) సేకరించినట్టు గురువారం కంపెనీ ప్రకటించింది. ఈ బాండ్ల ఇష్యూకు విదేశీ మార్కెట్లలో భారీ స్పందన లభించింది. ఇష్యూ మూడు రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ కాగా, 11.5 బిలియన్ డాలర్ల విలువగల బిడ్స్ వచ్చాయని ఆర్ఐఎల్ తెలిపింది. ఇప్పటివరకూ దేశీ కార్పొరేట్లు జారీచేసిన విదేశీ కరెన్సీ బాండ్ ఇష్యూల్లో ఇదే పెద్దది. ఇంతకుముందు 2014లో ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్.. డాలర్ బాండ్ల ద్వారా 2.2 బిలియన్లు సమీకరించింది.
3 కాల పరిమితులు, 3 రకాల వడ్డీ రేట్లు
రిలయన్స్ తాజాగా మూడు కాలపరిమితులతో కూడిన బాండ్లను మూడు రకాల వడ్డీ రేట్లతో జారీచేసింది. 10 సంవత్సరాల పరిమితిగల బాండ్లను 2.875 శాతం వడ్డీ రేటుతో ఆఫర్చేసి 1.5 బిలియన్ డాలర్లు సమీకరించింది. 1.75 బిలియన్ డాలర్ల కోసం 30 సంవత్సరాల లావాదేవీ 3.625 శాతం వడ్డీ రేటుపై జరగ్గా, 40 సంవత్సరాల డీల్ను 3.75 శాతం వడ్డీ రేటుతో పూర్తిచేసి 750 మిలియన్ డాలర్లు సేకరించింది. జపాన్ మినహా ఏ ఇతర ఆసియా కంపెనీ ఇప్పటివరకూ 40 సంవత్సరాల పరిమితిగల డాలర్ బాండ్లను జారీచేయలేదు. ఈ బాండ్లకు 2032-2062 మధ్య కాలాల్లో రిలయన్స్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. వడ్డీని ఆరునెలలకోసారి చెల్లిస్తుంది. ఈ బాండ్ల కూపన్లు (వడ్డీ రేటు) అమెరికా ట్రెజరీలతో అనుసంధానించి ఉంటాయని, పదేండ్ల యూఎస్ ట్రెజరీ నోట్కంటే తాము జారీచేసిన 10 సంవత్సరాల బాండ్లపై 1.2 శాతం అధిక వడ్డీ రేటును ఆఫర్ చేసినట్లు రిలయన్స్ వివరించింది. 30 ఏండ్ల బాండ్పై 1.60 శాతం, 40 ఏండ్ల బాండ్పై 1.70 శాతం ఎక్కువ వడ్డీ రేటుపై నిధులు సేకరించింది. ఈ బాండ్ల కోసం ఫండ్ మేనేజర్లు, బీమా కంపెనీలు, బ్యాంక్లు, ప్రభుత్వ సంస్థలు సబ్స్క్రయిబ్ చేయగా, 69 శాతం బాండ్లు ఫండ్ మేనేజర్లు తీసుకొంటున్నారని రిలయన్స్ వివరించింది.
ఫిబ్రవరిలో 1.5 బిలియన్ డాలర్ల చెల్లింపు
సమీకరించిన నిధుల్ని రుణాల్ని తీర్చేందుకు ఉపయోగించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాలపరిమితి ముగియనున్న రుణ పత్రాలకు 1.5 బిలియన్ డాలర్లు చెల్లించనుంది. ఇష్యూకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అందించిన మద్దతు.. కంపెనీ పటిష్టతకు సంకేతమని ఆర్ఐఎల్ సీఎఫ్వో శ్రీకాంత్ వెంకటాచారి చెప్పారు.
డుంజోలో రిలయన్స్ రిటైల్ పెట్టుబడులు
దేశంలో ప్రధాన క్విక్కామర్స్ కంపెనీ అయిన డుంజోలో రిలయన్స్ రిటైల్ భారీ వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు ముకేశ్ అంబానీ కంపెనీ 200 మిలియన్ డాలర్లు (రూ.1,488 కోట్లు) పెట్టుబడి చేసింది. డుంజో తన తాజా ఫండింగ్ రౌండ్లో 240 మిలియన్ డాలర్లు (రూ.1.787 కోట్లు) సమీకరించగా, ఇందులో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అధికంగా పెట్టుబడి చేసి 25.8 శాతం డుంజో వాటాను స్వంతం చేసుకుంది. ఈ మేరకు ఇరు కంపెనీలూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశాయి. డుంజోలో ఇప్పటికే షేర్హోల్డర్లయిన లైట్బాక్స్, లైట్రాక్, 3ఎల్ క్యాపిటల్, అల్టేరియా క్యాపిటల్లు తాజా ఫండింగ్ రౌండ్లో కూడా పాలుపంచుకున్నాయి.
వ్యాపార భాగస్వామ్యాలు కూడా…
తాజా ఫండింగ్ రౌండ్కు తోడు డుంజో, రిలయన్స్ రిటైల్లు కొన్ని వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు సైతం కుదుర్చుకోనున్నాయి. ఈ ఒప్పందాల ప్రకారం రిలయన్స్ రిటైల్ నిర్వహిస్తున్న రిటైల్ స్టోర్లకు డుంజో హైపర్లోకల్ లాజిస్టిక్స్ అందిస్తుంది. జియోమార్ట్ మర్చెంట్ నెట్వర్క్కు లాస్ట్ మైల్ డెలివరీల సదుపాయాన్ని డుంజో అందిస్తుంది. నిత్యావసరాల్ని ఖాతాదారులకు తక్షణమే డెలివరీ అందించేందుకు నగరాల్లో ఎక్కడిక్కడే ఏర్పాటుచేసే మైక్రో వేర్హవుస్ల్ని విస్తరించడం, నగరాల్లోని స్థానిక వ్యాపారులకు తన బీ2బీ వెర్టికల్ ద్వారా లాజిస్టిక్స్ అందించడం వంటి కార్యకలాపాలకు తాజా నిధుల్ని ఖర్చు చేయనున్నట్లు డుంజో తెలిపింది. ఇండియాలో క్విక్ కామర్స్ వ్యాపారానికి డుంజో నాందిపలికిందని, అది మరింతగా విస్తరించేందుకు తాము మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఈషా అంబానీ చెప్పారు. అలాగే డుంజో భాగస్వామ్యంతో రిలయన్స్ రిటైల్ స్టోర్ల నుంచి ఖాతాదారులకు ఉత్పత్తులను సత్వరమే డెలివరీ చేస్తామన్నారు.