రిలయన్స్ రిటైల్ విభాగం అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. వచ్చే మూడు నుంచి ఐదేండ్లకాలంలో ఈ విభాగం మూడు రెట్ల వృద్ధిని సాధించనున్నదని ముకేశ్ అంబానీ ఆశాభావం వ్యక్తంచేశారు. అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న రిలయన్స్ రిటైల్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిటైల్ సంస్థల జాబితాలో టాప్-10 లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే వచ్చే మూడేండ్లలో ఈ విభాగం 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నదని గురువారం జరిగిన వాటాదారుల సమావేశంలో ముకేశ్ అన్నారు. గతేడాది 65 వేల మందికి ఉపాధి లభించింది. అలాగే ఈ-కామర్స్ సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన జియోమార్ట్.కామ్లోని ఆన్బోర్డ్పై కోటి మంది వ్యాపారస్తులను చేర్చాలనుకుంటున్నది. కరోనాతో ఆర్థిక రంగం కుంటుపడినప్పటికీ గతేడాది ఈ విభాగం రూ.1,53,818 కోట్ల ఆదాయంపై రూ.9,842 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
పరిశోధన, డిజైనింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం
ఇబ్బందికర పరిస్థితుల్లోనూ గతేడాది 1,500 స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం సంఖ్య 12,711కి చేరుకున్నాయి.
ప్రతి ఎనిమిది మంది భారతీయుల్లో ఒక్కరు రిలయన్స్ రిటైల్లో షాపింగ్ చేస్తున్నారు.
రిలయన్స్ షేరు డౌన్
వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ నిర్ణయాలు మదుపరులకు ఏ మాత్రం రుచించలేదు. ఒక దశలో మూడు శాతానికి పైగా పడిపోయిన కంపెనీ షేరు ధర చివరకు 2.35 శాతం నష్టంతో రూ.2,153.35 వద్ద నిలిచింది. అటు ఎన్ఎస్ఈలోనూ కంపెనీ షేరు 2.35 శాతం తగ్గి రూ.2,153.50 వద్ద నిలిచింది.