న్యూఢిల్లీ, మే 25: రిలయన్స్ పవర్ లిమిటెడ్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థకు రూ.397.66 కోట్ల నష్టం వచ్చింది. ఇంధనం కోసం పెట్టే ఖర్చులు అధికం కావడం వల్లనే నష్టాలు వచ్చాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ ఆదాయం రూ.1,853.42 కోట్ల నుంచి రూ.2,193.85 కోట్లకు పెరిగాయి. చమురు కోసం అయ్యే ఖర్చు రూ.823.47 కోట్ల నుంచి రూ.953.67 కోట్లకు పెరిగినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం సంస్థ 6 వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నది.