Viacom 18 – Walt Disney | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ వయాకాం 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్నది. 850 కోట్ల డాలర్ల విలువ గల తమ రెండు సంస్థల విలీన ఒప్పందాన్ని ఆమోదించాలని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్.. ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ని కోరింది. ఉమ్మడిగా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ నడిపేందుకు వాల్ డిస్నీ కంపెనీ ఆధ్వర్యంలోని స్టార్ ఇండియా, రిలయన్స్ అనుబంధ వయాకాం 18 సంస్థల విలీనాన్ని ప్రతిపాదిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. రిలయన్స్ వయాకాం 18, స్టార్ ఇండియా విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత జాయింట్ వెంచర్ ఏర్పాటవుతుందని సీసీఐకి సమర్పించిన నోటిఫైడ్ ఫైల్లో తెలిపింది.
అమెరికా కేంద్రంగా పని చేస్తున్న వాల్ట్ డిస్నీ కంపెనీ (టీడబ్ల్యూడీసీ) అనుబంధ స్టార్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో టీవీ బ్రాడ్ కాస్టింగ్, ఓటీటీ ప్లాట్ ఫామ్ నిర్వహిస్తున్నది. మరోవైపు, రిలయన్స్ అనుబంధ వయాకాం 18 భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా టీవీ చానెళ్ల బ్రాడ్ కాస్టింగ్ బిజినెస్, ఓటీటీ ప్లాట్ ఫామ్, సినిమాల నిర్మాణం, పంపిణీ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నది. రూ.70 వేల కోట్ల (8.5 బిలియన్ డాలర్లు) బిజినెస్ కోసం గత ఫిబ్రవరిలో గ్లోబల్ మీడియా జెయింట్ వాల్ట్ డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ మీడియా సంస్థలను విలీనం చేసేందుకు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
రెండు సంస్థల విలీనం ప్రక్రియ పూర్తయిన తర్వాత భారత్ మీడియా, వినోద రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరిస్తుంది. పలు భాషల్లో 100కి పైగా చానెల్స్, 750 మిలియన్ల మంది వీక్షకులు గల రెండు లీడింగ్ ఓటీటీలు ఉంటాయి. జాయింట్ వెంచర్ సంస్థకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ చైర్ పర్సన్గా వ్యవహరిస్తారు. ఉదయ్ శంకర్ వైస్ చైర్పర్సన్గా ఉంటారు. రిలయన్స్ వయాకాం 18 – స్టార్ ఇండియా సంస్థల విలీనం తర్వాత రిలయన్స్కు 63.16 శాతం, వాల్ట్ డిస్నీ 36.84 శాతం వాటాలు కలిగి ఉంటాయి. జాయింట్ వెంచర్లో ఓటీటీ బిజినెస్ పురోగతి కోసం సుమారు రూ.11,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ కూడా అంగీకరించింది.