న్యూఢిల్లీ, జూలై 22: చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. చమురు రిఫైనింగ్, టెలికం, రిటైల్ రంగాలు అంచనాలకు మించి రాణించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికపు కన్సాలిడేటెడ్ నికర లాభంలో 46 శాతం వృద్ధి నమోదైంది. రూ.17,955 కోట్లు లేదా ప్రతి షేరుకు రూ.26.54 కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 12,273 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.18.96 లాభాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది చివరి త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 11 శాతం పెరిగింది. రష్యా క్రూడాయిల్ తక్కువ ధరకు లభించడం, ఎగుమతి చేసే చమురుపై మార్జిన్లు అధికంగా ఉండటం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ చమురు మార్కెట్ ఆశాజనకంగా ఉండటం కలిసొచ్చిందని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు.
చమురు ఎగుమతితో సంస్థకు రూ.96,212 కోట్ల ఆదాయం సమకూరింది.
రిలయన్స్ రిటైల్ విభాగం రూ.2,061 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత త్రైమాసికంలో కొత్తగా 792 స్టోర్లు ప్రారంభించింది.
కన్సాలిడేటెడ్ ఆదాయం 53 శాతం ఎగబాకి రూ.2,42,982 కోట్లకు చేరుకున్నది.
ప్రస్తుతం సంస్థ వద్ద రూ.2,05,727 కోట్ల నగదు నిల్వలు ఉండగా, రూ.2,63,382 కోట్ల అప్పు ఉన్నది.
జియో లాభాలకు టారిఫ్ దన్ను
దేశంలో అతిపెద్ద టెలికం దిగ్గజం రిలయన్స్ జియో లాభాలకు టారిఫ్ పెంపు దన్నుగా నిలిచాయి. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.4,335 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,501 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 24 శాతం అధికం. అటు ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 21.5 శాతం అధికమై రూ.21,873 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. టారిఫ్లు పెంచడంతో ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం పెరగడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని పేర్కొంది. నెలకు ఒక్కో కస్టమర్ నుంచి సరాసరి ఆదాయం రూ.167.60గా ఉన్నది.