Reliance-Disney | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: వాల్ట్ డిస్నీ కో, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య భారీ డీల్ కుదిరింది. దీని ప్రకారం ఇరు సంస్థలు దేశంలోని తమ మీడియా కార్యకలాపాలను ఒక్కటి చేస్తున్నాయి. ఈ మేరకు ఒప్పందాలనూ బుధవారం ఆయా కంపెనీలు ప్రకటించాయి. విలీన సంస్థ విలువ రూ.70,352 కోట్లు (8.5 బిలియన్ డాలర్లు)గా ఉంటుందని అంచనా. కొత్త కంపెనీలో రిలయన్స్, దాని అనుబంధ సంస్థలకే మెజారిటీ వాటా దక్కనున్నది. 63.16 శాతం ఉంటుందని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్, డిస్నీ పేర్కొన్నాయి.
డిస్నీకి మిగతా 36.84 శాతం వాటా ఉండనున్నది. ఇక ఇందులో రెండు స్ట్రీమింగ్ సర్వీసులు, 120 టెలివిజన్ చానల్స్ ఉంటాయి. ఈ క్రమంలో అతిపెద్ద ఓటీటీ సబ్స్ర్కైబర్లున్న సంస్థగా కూడా రిలయన్స్, డిస్నీల విలీన సంస్థే నిలువనున్నది. కాగా, జీ-సోనీ రూ.80,000 కోట్ల డీల్ విఫలమైన నేపథ్యంలో దేశీయ మీడియా ఇండస్ట్రీలో రిలయన్స్-డిస్నీ డీల్ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఇక విలీన సంస్థకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ చైర్పర్సన్గా ఉండనున్నారు. డిస్నీ మాజీ ఉన్నతోద్యోగి ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్గా ఉంటారు.
రూ.11,500 కోట్ల పెట్టుబడులు
జాయింట్ వెంచర్లో దాదాపు రూ. 11,500 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు రిలయన్స్ అంగీకరించింది. సోనీ, నెట్ఫ్లిక్స్ వంటి ఇతర ప్రత్యర్థి సంస్థల నుంచి మార్కెట్లో ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకునేందుకు ఇది అవసరమని కూడా రిలయన్స్ భావిస్తున్నది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో డిస్నీప్లస్హాట్స్టార్ పెయిడ్ సబ్స్ర్కైబర్లు తగ్గిపోయారు. 5.5 కోట్ల నుంచి 4 కోట్లకు దిగజారారు. అయితే ఆయా క్రీడల ప్రత్యక్ష ప్రసారాల హక్కులను జియో సినిమా గెల్చుకోవడమే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో తాజా డీల్తో ఇరు సంస్థలు ఏకమవుతుండటం ఆయా యాజమాన్యాలకు కొత్త జోష్నిస్తున్నది. ప్రస్తుతం రిలయన్స్ మీడియా వెంచర్స్ అన్నీ నెట్వర్క్ 18లోనే ఉన్నాయి. టీవీ18 న్యూస్ చానల్స్, కలర్స్ బ్రాండ్లో నడుస్తున్న చానల్స్, ఇతర స్పోర్ట్స్ చానళ్లూ ఇందులోనే ఉన్నాయి. సీఎన్బీసీ/సీఎన్ఎన్న్యూస్, మనీకంట్రోల్.కామ్, బుక్మైషో, ఇతర మ్యాగజైన్లూ నెట్వర్క్ 18లో భాగమే. అలాగే రిలయన్స్కు వేరుగా జియోస్టూడియోస్ పేరుతో ఓ సినీ ప్రొడక్షన్స్ విభాగం కూడా ఉన్నది. స్టాక్ మార్కెట్ నమోదిత కేబుల్ పంపిణీ కంపెనీలైన డెన్, హాథవేల్లోనూ రిలయన్స్కు మెజారిటీ వాటాలున్న సంగతి విదితమే.