న్యూఢిల్లీ, జనవరి 12: గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ఠానికి తగ్గింది. డిసెంబర్లో 5.72 శాతంగా నమోదైంది. ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడమే ఇందుకు కారణమని గురువారం విడుదలైన అధికారిక గణాంకాల్లో పేర్కొన్నారు. కాగా, అంతకుముందు నెల నవంబర్లో 5.88 శాతంగా ఉన్న ఈ వినియోగదారుల ధరల సూచీ.. 2021 డిసెంబర్లో 5.66 శాతంగా ఉన్నది. మళ్లీ ఇప్పుడే ఆ దరిదాపుల్లోకి వచ్చింది. ఇక నిరుడు డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం 4.19 శాతంగా, నవంబర్లో 4.67 శాతంగా ఉన్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది.
7.2 శాతానికి ఐఐపీ
దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గత ఏడాది నవంబర్లో ఐదు నెలల గరిష్ఠాన్ని తాకుతూ 7.2 శాతం వృద్ధిని కనబర్చింది. అంతకుముందు నెల అక్టోబర్లో ఇది మైనస్ 4.2 స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా, 2021 నవంబర్లో ఐఐపీ వృద్ధిరేటు 1 శాతంగానే ఉన్నట్టు ఎన్ఎస్వో ఈ సందర్భంగా తెలిపింది. నవంబర్లో తయారీ, గనులు, విద్యుదుత్పత్తి పెరిగింది.