న్యూఢిల్లీ, మే 16: చిన్న ఇన్వెస్టర్లకు రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని చిన్న చిన్న భాగాలుగా ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్న ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్స్ (ఎఫ్వోపీలు)ను తన నియంత్రణ పరిధిలోకి తీసుకురానుంది. చిన్న ఇన్వెస్టర్లను పరిరక్షించేక్రమంలో ఎఫ్వోపీల నియంత్రణాపై సెబీ తాజాగా ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది. తాము ప్రతిపాదించిన నిబంధనలు రియల్ ఎస్టేట్ రంగం, మార్కెట్ అభివృద్ధిచెందడానికి దోహదపడుతుందని, ఇన్వెస్టర్ల ప్రయోజనాల సంరక్షణ జరుగుతుందని సెబీ పేర్కొంది.
సెబీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) నిబంధనలకు లోబడి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా రీట్స్గా ఎఫ్వోపీలను పరిగణించాలని సెబీ ప్రతిపాదించింది. రియల్ ఎస్టేట్ ఆస్తి కొనుగోలు వ్యయాన్ని పలు భాగాలుగా విభజించి, పలువురు ఇన్వెస్టర్లకు ఎఫ్వోపీల ద్వారా విక్రయించడం రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మదుపు పద్ధతిగా ఆవిర్భవిస్తున్నది. ఆయా ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసిన స్పెషల్ పర్సస్ వెహికిల్స్ (ఎస్పీవీలు) ఈ మేరకు సెక్యూరిటీలను జారీచేస్తుంటాయి. అటువంటి ఎస్పీవీలు రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని కొనుగోలు చేస్తాయి. ఎఫ్వోపీలను ఆపరేట్ చేసే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు లేదా బ్రోకర్లు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ ఆస్తిని సైతం నిర్వహిస్తారు.
మదుపరుల రక్షణ కోసం..
రెండు, మూడేండ్లుగా చిన్న, చిన్న రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసే వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్స్ పెరిగిపోయాయని, ఆ ప్లాట్ఫామ్స్ ఇన్వెస్టర్లకు భవనాలు, ఆఫీస్ స్పేస్లు, షాపింగ్ సెంటర్లు, కాన్ఫెరెన్స్ సెంటర్లలో మదుపునకు ఆహ్వానిస్తున్నాయని సెబీ వివరించింది. అటువంటి రియాల్టీ విలువ, సమాచారం, ఇతర ప్రమాణాలపై అవగాహన లేక ఇన్వెస్టర్లు దెబ్బతింటారని, ఈ కారణంగా ఎఫ్వోపీలను ఎంఎస్ఎం రీట్స్గా పరిగణిస్తూ రీట్ నిబంధనల పరిధిలోకి తీసుకు రావాలని ప్రతిపాదిస్తున్నట్టు సెబీ పేర్కొంది.