న్యూఢిల్లీ, జూలై 22: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో ఓ డిజిటల్ కరెన్సీని పరిచయం చేయబోతున్నది. దశలవారీగా దీన్ని చలామణిలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులోనే పైలెట్ ప్రాజెక్టుల్లో భాగంగా ఈ కరెన్సీని హోల్సేల్, రిటైల్ విభాగాల్లో ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ గురువారం ఇక్కడ తెలిపారు. ఇప్పటికే హోల్సేల్, రిటైల్ సెగ్మెంట్లలో పలు దేశాల సెంట్రల్ బ్యాంక్లు తమ డిజిటల్ కరెన్సీలను వాడుకలోకి తెచ్చాయని ఆయన గుర్తుచేశారు. ‘ది విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’ నిర్వహించిన ఆన్లైన్ చర్చలో రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ దేశీయంగా సెంట్రల్ బ్యాంకే ఓ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రైవేట్ వర్చువల్ కరెన్సీ వాడకంతో వచ్చే లాభాలను ప్రజలందరికీ చట్టబద్దంగా అందించినట్లవుతుందన్నారు. డిజిటల్ కరెన్సీకి కూడా ఓ రూపాయి తరహాలోనే ప్రాధాన్యతను కల్పించవచ్చన్నారు. అంతేగాక ప్రైవేట్ వర్చువల్ కరెన్సీల్లో తలెత్తే ఒడిదుడుకుల నుంచి ప్రజలను రక్షించినట్లవుతుందని కూడా వ్యాఖ్యానించారు. నగదుపై ఆధారపడటం తగ్గి, లావాదేవీల వ్యయం దిగివస్తుందన్న ఆయన దీనివల్ల అటు పరిశ్రమకు ఇటు ప్రజలకు లాభం చేకూరగలదని అభిప్రాయపడ్డారు. అయితే సాంకేతికంగా ఇందుకున్న సాధ్యాసాధ్యాలను, బ్యాంకర్లు-పరిశ్రమ అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం వస్తుందన్నారు. ఎందుకంటే దీని విలువ పడిపోతే బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఒత్తిడికి గురయ్యే ప్రమాదం లేకపోలేదన్నారు.