Nirmala on Crypto | క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని ఆర్బీఐ కోరుతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. క్రిప్టో కరెన్సీల వల్ల దేశ ఆర్థిక, ద్రవ్య సుస్థిరతకు ముప్పు వాటిల్లుతుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలోనే క్రిప్టో కరెన్సీలపై చట్టం తేవాలని భారతీయ రిజర్వు బ్యాంక్ సిఫారసు చేసింది, ఆర్బీఐ ఆలోచన ప్రకారం క్రిప్టో కరెన్సీలను నిషేధించాల్సిందేనని సోమవారం లోక్సభ ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో ఆమె తెలిపారు.
క్రిప్టో కరెన్సీలతో రిస్క్, బెనిఫిట్లపై అంతర్జాతీయ సమాజం సహకారంతో చర్చించి ఉమ్మడి పన్ను విధానం, ప్రమాణాలు ఖరారు చేశాకే వాటిపై నిషేధం విధించడం సాధ్యమన్నారు నిర్మలా సీతారామన్. అంతర్జాతీయ సమాజ సహకారంతో నిషేధం విధిస్తే సమర్థవంతమైన ఫలితాలు వస్తాయన్నారు. క్రిప్టో కరెన్సీలు కరెన్సీలు కావని ఆర్బీఐ గుర్తుచేసిందన్నారు. ప్రతి మోడ్రన్ కరెన్సీని ఆర్బీఐ లేదా ప్రభుత్వం జారీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అధిక రిటర్న్స్ మీద ఆధారపడిన అంచనాలు, ఊహాగానాల ప్రకారమే క్రిప్టో కరెన్సీల విలువ పూర్తిగా ఆధారపడి ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. వీటి వల్ల దేశ ఆర్థిక, ద్రవ్య సుస్థిరత దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీలు సరిహద్దుల్లేనివని, నియంత్రణ మధ్యవర్తిత్వాన్ని నివారించడానికి అంతర్జాతీయ సహకారం అవసరం అని అన్నారు.
క్రిప్టో కరెన్సీ (వర్చువల్ కరెన్సీ)ల పట్ల 2013 నుంచి నిరంతరం ఆర్బీఐ… క్రిప్టో యూజర్లు, వ్యాపారులను హెచ్చరిస్తూనే ఉంది. వీటితో ఆర్థిక, నిర్వహణ, న్యాయపరమైన, ఖాతాదారు రక్షణ భద్రత సంబంధ ముప్పు పొంచి ఉందని చెబుతున్నది. వర్చువల్ కరెన్సీ లావాదేవీలను నిషేధిస్తూ 2018 ఏప్రిల్ ఆరో తేదీన ఆర్బీఐ సర్క్యులర్ కూడా జారీ చేసింది. కానీ 2020 మే నాలుగో తేదీన ఆర్బీఐ సర్క్యులర్ను సుప్రీంకోర్టు పక్కన బెట్టేసింది.