కేంద్రానికి డివిడెండ్ రూపంలో రూ.99,122 కోట్లు..
ముంబై, మే 21: కేంద్ర ప్రభుత్వానికి రూ.99,122 కోట్ల డివిడెండును చెల్లించాలని రిజర్వుబ్యాంక్ నిర్ణయించింది. 2021 మార్చితో ముగిసిన తొమ్మిదినెలల ఖాతాసంవత్సరంలో ఆర్బీఐ కార్యకలాపాల ద్వారా ఆర్జించిన మిగులును కేంద్రానికి బదిలీ చేయాలని శుక్రవారం గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో వీడియో కాన్ఫెరెన్సింగ్ ద్వారా జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఆర్బీఐ మిగులును డివిడెండుగా వ్యవహరిస్తుంటారు. 2019-20 ఖాతా సంవత్సరంలో కేంద్రానికి ఆర్బీఐ రూ. 57,128 కోట్ల మిగులును బదిలీ చేసింది. అంతక్రితం ఏడాది (2018-19) రూ.1.76 లక్షల కోట్లను బదిలీచేయడం విశేషం.
ఈ ఏడాది నుంచి రిజర్వుబ్యాంక్ ఖాతా సంవత్సరాన్ని ప్రభుత్వ ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా ఏప్రిల్-మార్చికి మార్చారు. 1940 నుంచి జూలై -జూన్ ను ఖాతాసంవత్సరంగా ఆర్బీఐ అనుసరిస్తున్నది. 2020-21 సంవత్సరంలో ఆర్బీఐ, జాతీయబ్యాంకులు, ద్రవ్య సంస్థల నుంచి రూ.61,826 కోట్ల మిగులు/డివిడెండుగా అందగలదని, 2021-22లో ఈ మొత్తం రూ.53,510 కోట్లుగా కేంద్ర బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలకంటే అధికంగానే తాజాగా ఆర్బీఐ మిగులును బదిలీ చేయాలని నిర్ణయించడం గమనార్హం. దీంతో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మరిన్ని నిధులు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయి.
అధిక మిగులు ఎలా సాధ్యం?
మార్కెట్ కార్యకలాపాల ద్వారా అధికాదాయాన్ని ఆర్జించడం, విదేశీ మారక నిల్వలు రికార్డుస్థాయిలో వుండటం, విదేశీ కరెన్సీ విక్రయాల ద్వారా లాభం పొందడం వంటి కారణాలతో కేవలం తొమ్మిదినెలల ఖాతా సంవత్సరంలోనే అంచనాలకంటే అధికంగా రూ.99 వేల కోట్ల మిగులును ఆర్బీఐ కేంద్రానికి బదిలీ చేయగలిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికరంగా 55 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీని విక్రయించడం ద్వారా వచ్చిన పుస్తకలాభాల్ని ఆర్బీఐ లాభనష్టాల ఖాతాలో చూపించగలిగింది.