న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఆర్ధిక వ్యవస్థపై సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా లేదని ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది. వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపడితే ఎకానమీపై మహమ్మారి నష్టాన్ని నియంత్రించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ కొనసాగించేందుకు ప్రైవేట్ డిమాండ్ పెరగడంతో పాటు వినిమయం ఊపందుకోవాలని పేర్కొంది. ఫస్ట్ వేవ్ లో వైమానిక, టూరిజం, ఆతిథ్య రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని దీంతో సేవా రంగం కుదేలైందని పేర్కొంది.
మహమ్మారి విలయం నుంచి ఆర్థిక వ్యవస్ధ బయటపడాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. సెకండ్ వేవ్ వ్యాప్తిని ఎంత త్వరగా మనం అధిగమిస్తామనే దానిపై దేశ వృద్ధి ఆధారపడి ఉందని పేర్కొంది. పలు రంగాల్లో చేపట్టిన సంస్కరణలు భారత వృద్ధి సామర్ధ్యానికి ఊతమిస్తాయని ఆర్బీఐ వార్షిక నివేదిక వివరించింది. ఆర్ధిక స్ధిరత్వాన్ని కొనసాగిస్తూ వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరిగేలా చర్యలు చేపడతామని పేర్కొంది.