ముంబై, నవంబర్ 15: బజాజ్ ఫైనాన్స్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించింది. ఈకామ్, ఇన్స్టా ఈఎంఐ కార్డుల కింద రుణాలను మంజూరు చేయడంగానీ, ఇవ్వడంగానీ చేయవద్దని బుధవారం ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేసింది.
కాగా, డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలను బజాజ్ ఫైనాన్స్ పాటించలేదని, అందుకే ఈ ఆంక్షలు తెచ్చామని ఆర్బీఐ ఈ సందర్భంగా ప్రకటించింది. లోన్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రుణగ్రహీతలకు సంస్థ ఇవ్వడం లేదని తెలిపింది. ఈ క్రమంలోనే బజాజ్ ఫైనాన్స్ తీరు సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఈ ఆంక్షల్ని సమీక్షించి ఓ నిర్ణయానికి వస్తామని, అప్పటిదాకా ఇంతేనని ఆర్బీఐ పేర్కొన్నది.