న్యూఢిల్లీ, డిసెంబర్ 7: రుణగ్రహీతలపై వడ్డీల భారం మరింత పెరిగింది. రెపోరేటు మరో 0.35 బేసిస్ పాయింట్లు పెరగగా, ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా మొత్తం 2.25 శాతం ఎగిసింది. దీంతో గృహ రుణాల నెలసరి వాయిదా (ఈఎంఐ) మొత్తాలూ సుమారు 23 శాతం పెరిగాయి. వాహన, విద్య, వ్యక్తిగత, వ్యాపార రుణాలూ ఖరీదైపోయాయి.
ఈ ఏడాది మార్చిలో 20 ఏండ్ల కాలపరిమితితో 7 శాతం వడ్డీరేటుపై రూ.30 లక్షల రుణం తీసుకున్నవారి విషయానికొస్తే.. సదరు వడ్డీరేటు ఇప్పుడు 9.25 శాతానికి చేరుతుంది. దీంతో రుణగ్రహీతల ఈఎంఐ కూడా రూ.23,258 నుంచి రూ.27,387కు పెరుగుతుంది. అంటే వడ్డీరేటు 2.25 శాతం పెరగడం వల్ల ఈఎంఐ రూ.4,129 లేదా 17.75 శాతం పెరుగుతున్నదన్నమాట. ఒకవేళ రుణ కాలపరిమితి 30 ఏండ్లుగా ఉంటే ఈఎంఐ దాదాపు 23 శాతం పెరుగుతుంది. మొత్తానికి తాజా పెంపు (0.35 శాతం) వల్ల క్రితంతో చూస్తే ఈఎంఐ రూ.668 పెరుగుతుంది.
రుణగ్రహీత రిటైర్మెంట్ వయసు ఆధారంగా వారి గృహ రుణాల కాలపరిమితిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. అయితే వడ్డీరేట్లు పెరుగుతున్నప్పుడు ఒకవేళ కాలపరిమితిని పెంచేందుకు అవకాశం లేకపోతే.. అప్పుడు రుణగ్రహీతకు రెండు మార్గాలను ఎంచుకొనేందుకు వీలుంటుంది. అవే ఈఎంఐని పెంచుకోవడం లేదా రుణంలో కొంత తిరిగి చెల్లించేయడం.
పెరిగే ఈఎంఐలను భరించే స్థోమత ఉంటే రుణగ్రహీతలు తమ రుణకాలపరిమితిని పెంచుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. నగదు అందుబాటులో ఉంటే రుణం కొంతవరకు తీర్చేయడం మంచిది. బకాయిలో ఏటా 5 శాతం చొప్పున చెల్లిస్తూపోయినా 20 ఏండ్ల అప్పు.. 12 ఏండ్లకే తీరిపోతుంది. ప్రతీ సంవత్సరం ఒక్క ఈఎంఐని అదనంగా చెల్లిస్తూపోయినా 17 ఏండ్లలోనే ఇంటి అప్పును తీర్చేయవచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే ఏటా ఈఎంఐని 5 శాతం చొప్పున లేదా 10 శాతం చొప్పున పెంచుకుంటూపోయినా 13 ఏండ్లు కాదంటే 10 ఏండ్లలోపే రుణ విముక్తులు అవుతారని పేర్కొంటున్నారు.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో బేస్డ్ లెండింగ్ రేటు(ఆర్బీఎల్ఆర్)ని 9.10 శాతానికి పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు
(ఎంసీఎల్ఆర్)ని 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.60 శాతానికి చేరుకున్నది.