RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మునుపటి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ఇవాళ్టి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటు (Repo Rate) లో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష ఇది. గత ఏడాది ఈ వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ పలుమార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ.. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోతపెట్టింది. ఆ తర్వాత డిసెంబర్లో మరో పావు శాతం తగ్గించింది. దాంతో గత ఏడాది మొత్తంగా రెపో రేటు 1.25 శాతం వరకు దిగొచ్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికంలో 6.9 శాతం, రెండో త్రైమాసికంలో 7 శాతం వృద్ధి నమోదవ్వొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉండొచ్చని తెలిపింది. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4 శాతం, రెండో త్రైమాసికంలో 4.2 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావచ్చని అర్బీఐ అంచనా వేసింది.
కాగా జనవరి చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు 723.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యత రోజువారీ సగటున రూ.75 వేల కోట్లుగా ఉంది.