ముంబై: ఆర్బీఐ వడ్డీ రేట్లు మారలేదు. రెపో రేటు, రివర్స్ రెపో రేటును ఆర్బీఐ ఈసారి కూడా యధాతథంగా ఉంచింది. గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రెపో రేటును 4 శాతంగా ఉంచినట్లు తెలిపారు. రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచారు. మళ్లీ కోవిడ్ విజృంభణతో దేశీయ ఆర్థిక ప్రగతి అస్థిరంగా మారినట్లు ఆయన తెలిపారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్ల ఇలా జరిగినట్లు ఆయన తెలిపారు. మార్కెట్లకు కావాల్సినంత ద్రవ్యాన్ని అందించనున్నట్లు శక్తికాంత్దాస్ వెల్లడించారు. ద్రవ్యపరపతి విధానంలో భాగంగా భారతీయ బ్యాంకులకు కొత్తగా 50వేల కోట్ల రుణం ఇవ్వనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
ఈసారి కూడా గృహ, ఆటో రుణగ్రహీతలకు ఊరట దక్కలేదు. రెపో, రివర్స్ రెపో రేట్లను మార్చకపోవడం వల్ల.. గృహ, ఆటో రుణాలు తీసుకున్నవారికి పెద్దగా కలిసిరాదు. వడ్డీ రేట్లలో మార్పులేని కారణంగా.. గృహ, ఆటో రుణాలపై ఈఎంఐలు కూడా తగ్గవు. ఏప్రిల్ అయిదో తేదీ నుంచి ఏడు తేదీ వరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి కమిటీ సమావేశమైంది. ఆరుగురు సభ్యుల బృందం తీసుకున్న నిర్ణయాలను ఇవాళ ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడించారు.