USFB to Takeover PMC Bank | పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ)ను ఢిల్లీ కేంద్రంగా సేవలందిస్తున్న యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (యూఎస్ఎఫ్బీ) టేకోవర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్బీఐ సోమవారం ముసాయిదా నివేదికతో బయటకు వచ్చింది. దీని ప్రకారం డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించేందుకు వారి డిపాజిట్లతోపాటు పీఎంసీ ఆస్తులు, రుణాలను యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంటుంది.
ఇందుకోసం యూఎస్ఎఫ్బీ రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. బ్యాంకింగ్ లైసెన్సుల ప్రకారం బ్యాంక్ ఏర్పాటు చేయడానికి అవసరమైన లైసెన్స్ కోసం రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. యూఎస్ఎఫ్బీకి పీఎంసీ స్వాధీనంపై తాము ప్రతిపాదించిన ముసాయిదాపై ప్రజల నుంచి వచ్చేనెల 10 సాయంత్రం ఐదు గంటల వరకు వరకు సలహాలు, సూచనలను స్వీకరిస్తుంది.
అటుపై పీఎంసీని యూఎస్ఎఫ్బీకి అప్పగించే విషయమై ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకోనున్నది. భారత్ పే, సెంట్రం గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈనెల ఒకటో తేదీ నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు ప్రారంభించింది.