న్యూఢిల్లీ, నవంబర్ 23: బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు 125 శాతం రిస్క్ వెయిటేజితో పర్సనల్ లోన్స్ ఇవ్వాలంటూ ఇటీవల రిజర్వ్బ్యాంక్ నిబంధనల్ని కఠినతరం చేయడంతో రుణ వృద్ధికి బ్రేకులు పడతాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ఆర్బీఐ తాజా నిబంధనల కారణంగా సెక్యూరిటీ లేకుండా ఇచ్చే ప్రతీ పర్సనల్ రుణం మొత్తంపై ఇక నుంచి ఆయా ఆర్థిక సంస్థలు ఎక్కువ మూలధనాన్ని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇటీవలి సంవత్సరాల్లో సెక్యూరిటీ లేని వినిమయ రుణాలు జోరుగా పెరగడంతో ఏర్పడే వ్యవస్థాగత రిస్క్లను నిరోధించడానికి రెగ్యులేటర్ చర్యలు తీసుకోవడం క్రెడిట్ పాజిటివ్గా తాము చూస్తున్నట్టు ఫిచ్ ఒక రిపోర్ట్లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో బ్యాంక్ల అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు రుణాలు 29.9 శాతం, పర్సనల్ రుణాలు 25.5 శాతం వృద్ధిచెందాయి.