Tokenisation | వివిధ బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఆన్లైన్ లావాదేవీలకు టోకెనైజేషన్ విధానం అమలు గడువు మూడు నెలలు పొడిగించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి టోకెనైజేషన్ విధానం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ.. కొన్ని భాగస్వామ్య పక్షాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టోకెనైజేషన్ విధానాన్ని మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ నెలాఖరు వరకు ఆర్బీఐ వాయిదా వేసింది.
వివిధ బ్యాంకుల ఖాతాదారుల డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు తస్కరించకుండా.. ఆన్లైన్ లావాదేవీల సేఫ్టీ కోసం ఆర్బీఐ ఈ టోకెనైజేషన్ పాలసీని తీసుకొచ్చింది. 2020 మేలో తొలిసారిగా ఆర్బీఐ ఈ విధానాన్ని ప్రతిపాదించింది.గతేడాది జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది.
కానీ, టోకెనైజేషన్ విధానం అమలు చేయడానికి ఆన్లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్లు, బ్యాంకులు, వ్యాపారులు సన్నద్ధం కాకపోవడంతో గతేడాది డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది ఆర్బీఐ. మరోమారు అభ్యర్థన రావడంతో జూన్ నెలాఖరు వరకు పొడిగించిన ఆర్బీఐ.. తాజాగా మరో మూడు నెలల సడలింపు ఇచ్చింది.