US Economy | వాషింగ్టన్, ఆగస్టు 2: ప్రపంచంలో అగ్రరాజ్యమైన యునైటెడ్ స్టేట్స్ పరపతిని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తగ్గించింది. అమెరికా క్రెడిట్ రేటింగ్ను డౌన్గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూఎస్ ప్రభుత్వ రుణాలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలన్నింటిలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయని, గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ పాలనా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఆరోపించింది. దీంతో రేటింగ్ను ‘ఏఏఏ’ నుంచి ‘ఏఏ+’కు డౌన్గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపింది. వాస్తవానికి క్రెడిట్ రేటింగ్స్లో ట్రిపుల్ ఏ అత్యున్నతమైనది. దానితర్వాతిదైన ‘ఏఏ+’ కూడా హై క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ను సూచిస్తుంది. తాజాగా ఫిచ్ రేటింగ్ను ఒక అంచె తగ్గించినప్పటికీ, యూఎస్ బాండ్లలో పెట్టుబడులు సురక్షితమేనని తాజా రేటింగ్ వెల్లడిస్తున్నదని విశ్లేషకులు తెలిపారు. యూఎస్ రేటింగ్ను తగ్గించడం చరిత్రలో ఇది రెండోసారి. 2011లో స్టాండర్డ్ అండ్ పూర్ డౌన్గ్రేడ్ చేసింది.
క్రెడిట్ రేటింగ్ తగ్గుదలతో అమెరికా ప్రభుత్వం బాండ్లను అధిక వడ్డీకి జారీచేయాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వ వడ్డీ వ్యయాలు పెరుగుతాయి. వాస్తవానికి యూఎస్ ట్రెజరీ బాండ్లపై తక్కువ వడ్డీ రేటు (ప్రస్తుతం 10 ఏండ్ల కాలపరిమితిగల బాండ్ 4.1 శాతం ఈల్డ్తో ట్రేడవుతున్నది) లభిస్తున్నప్పటికీ, అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షితమన్న భావనతో ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న ఆ దేశపు
బాండ్లను అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, చైనా, ఇండియాతో సహా పలు దేశాల కేంద్ర బ్యాంక్లు కొంటుంటాయి. 2011లో ఎస్ అండ్ పీ డౌన్గేడ్ చేసినపుడు ఆ ఏడాది అమెరికా ప్రభుత్వపు వడ్డీ వ్యయాలు 1.3 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి.
పాలనా ప్రమాణాల క్షీణత: ద్రవ్య, రుణ అంశాల్లో పలుగత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ పాలనా ప్రమాణాలు క్రమేపీ క్షీణిస్తున్నాయి.రుణ సేకరణ పరిమితి పెంపుపై ఇటీవల అధికార, ప్రతిపక్షం మధ్య జరిగిన పోరును ఫిచ్ ఉదహరించింది. యూఎస్ ప్రభుత్వ బడ్జెట్ ప్రక్రియ సంక్షిష్ఠంగా ఉందన్నది. పలు ఆర్థిక సంక్షోభాల కారణంగా జరిగిన పన్నుల కోతలు, సామాజిక వ్యయాలతో గత దశాబ్దకాలంగా ప్రభుత్వ రుణం పెరిగిపోయిందని తెలిపింది.
ద్రవ్య లోటు పెరుగుదల: 2023లో ప్రభుత్వ ద్రవ్యలోటు జీడీపీలో 6.3 శాతానికి పెరుగుతుందని ఫిచ్ అంచనా వేసింది. 2022లో ఇది 3.7 శాతం. 2024లో 6.6 శాతానికి, 2025లో మరింతగా 6.9 శాతానికి చేరుతుందన్నది.
అధిక రుణ భారం: జీడీపీతో పోలిస్తే యూఎస్ రుణం కొవిడ్ సంవత్సరమైన 2020లో 122.3 శాతం స్థాయికి చేరింది. అప్పటినుంచి తాజాగా 112.9 శాతానికి తగ్గినప్పటికీ, కొవిడ్ ముందస్తు ఏడాది 2019లో నమోదైన 100.1 శాతంకంటే అధికమేనని ఫిచ్ వివరించింది. 2025 డెట్-జీడీపీ రేషియో 118.4 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. రుణభారం పెరుగుతున్నందున, భవిష్యత్లో ఆర్థిక వ్యవస్థకు కలిగే షాక్లను తట్టుకోవడం క్లిష్ఠమవుతుందని వ్యాఖ్యానించింది.
ఆర్థిక సవాళ్లు: అధిక వడ్డీ రేట్లు, రుణ భారం, హెల్త్కేర్ వ్యయాల పెరుగుదల తదితర మధ్యకాలిక ఆర్థిక సవాళ్లకు ప్రభుత్వ పరిష్కార చర్యలేవీ లేవని రేటింగ్ ఏజెన్సీ ఆరోపించింది. వచ్చే దశాబ్దకాలంలో వడ్డీ భారం పెరుగుతుందని, వృద్ధుల జనాభా శాతం అధికం కానున్నందున, ఆరోగ్య సంరక్షణా వ్యయాలు సైతం పెరుగుతాయన్నది.
పన్నుల కోతలు: 2017లో ప్రకటించిన పన్నుల కోతల కాలపరిమితి 2025లో ముగియనున్నది. ఈ కోతల్ని శాశ్వతం చేయాలన్న రాజకీయ ఒత్తిడి ఏర్పడుతుందని, దీంతో ప్రభుత్వ లోటు అంచనాలు పెరుగుతాయని ఫిచ్ అంచనా వేసింది.
మాంద్యంలోకి ఆర్థిక వ్యవస్థ: వాణిజ్య వర్గాల పెట్టుబడులు తగ్గడం, వినియోగం బలహీనపడటం తదితర అంశాలతో ఈ ఏడాది చివరి త్రైమాసికం లేదా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకోవచ్చని అంచనా వేసింది.
ఫెడ్ రేట్ల పెంపు: ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్కల్లా ఫెడ్ రేటు 5.5 శాతం నుంచి 5.75 శాతానికి చేరవచ్చన్నది. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించాలన్న ఫెడ్ లక్ష్యం కష్టసాధ్యమన్నది.