Yes Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్ కో-ఫౌండర్.. రాణా కపూర్కు రూ.300 కోట్లకు పైగా ఫ్రాడ్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రాణా కపూర్ సహ నిందితుడు- అవంతా గ్రూప్కు చెందిన గౌతం థాపర్కు కూడా బెయిల్ మంజూరైంది. 2017-19 మధ్య అవంతా రియాల్టీ లిమిటెడ్ సంస్థ అనుబంధ ఔయోస్టర్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్కు యెస్ బ్యాంక్ నుంచి రుణం ఇవ్వడంలో అధికార దుర్వినియోగం జరిగిందని రాణా కపూర్, గౌతం థాపర్లపై అభియోగం.
ఈ కేసులో బెయిల్ మంజూరైనా ప్రస్తుతం సీబీఐ, ఈడీ ఆధ్వర్యంలో పలు కేసుల దర్యాప్తు జరుగుతుండటంతో రాణా కపూర్ ఇంకా తాలోజా జైలులోనే ఉండాల్సి ఉంటుంది. అవంత గ్రూప్కు రుణం మంజూరు చేయడంలో రాణ కపూర్ భార్య బిందు కపూర్, అవంత గ్రూప్ ప్రమోటర్ గౌతం థాపర్ అక్రమాలకు పాల్పడ్డారని అభియోగం. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ.. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణం వల్ల యెస్ బ్యాంకుకు రూ.466.51 కోట్ల నష్టం వాటిల్లింది.
రాణా కపూర్ తరపున విచారణకు హాజరైన విజయ్ అగర్వాల్ వాదిస్తూ.. తన క్లయింట్ను ఈడీ అరెస్ట్ చేయలేదన్నారు. అరెస్ట్ చేయకుండానే ఇప్పుడు ప్రాసిక్యూషన్ కంప్లయింట్ సమర్పించిందన్నారు. ఇప్పటికే ఢిల్లీలోని లైటేన్స్- అమృత్ శెర్గిల్ మార్గ్ వద్ద బంగ్లాను ఈడీ జప్తు చేసిందని గుర్తు చేశారు. కనుక చట్టం, కోర్టు ముందు నుంచి పారిపోలేరన్నారు.
దీంతో కొన్ని షరతులతో రాణాకపూర్కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. న్యాయస్థానం అనుమతి లేకుండా ప్రయాణం చేయొద్దని, ఆయన పాస్పోర్ట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రతి రోజూ కోర్టు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. వ్యక్తిగత పూచీకత్తు కింద రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.